వెంకట్‌రెడ్డికి తగ్గుతున్న ప్రయారిటీ!..కాంగ్రెస్‌ స్టేట్​ఎన్నికల కమిటీల్లో దక్కని అవకాశం

వెంకట్‌రెడ్డికి తగ్గుతున్న ప్రయారిటీ!..కాంగ్రెస్‌ స్టేట్​ఎన్నికల కమిటీల్లో దక్కని అవకాశం
  •  రేవంత్‌ రెడ్డి, జానారెడ్డి వర్గం నుంచీ ఎదురుగాలి
  • బ్రదర్స్ రాజకీయంగా విడిపోవడంతోనే తగ్గిన బలం

నల్గొండ, వెలుగు :  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీలో ప్రయారిటీ ఇవ్వట్లేదనే చర్చ జరుగుతోంది.  మునుగోడు ఉప ఎన్నికలప్పటి నుంచి ఆయనను రాజకీయంగా దెబ్బతీసేందుకు సొంత పార్టీ నేతలే యత్నిస్తున్నట్లు ఆయన వర్గం ఆరోపిస్తోంది. ఇటీవల హైకమాండ్​ ప్రకటించిన ఎన్నికల కమిటీల్లో వెంకటరెడ్డికి చోటు దక్కకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంటోంది.  ఇదేసమయంలో పీసీసీ మాజీ చీఫ్,​ ఎంపీ ఉత్తమ్​ కుమార్​రెడ్డికి మాత్రం కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వడం వెనుక బలమైనరాజకీయ కోణం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
 
బ్రదర్స్​హవా తగ్గినందుకేనా...? 

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్​లో బ్రదర్స్​హవా పదేళ్ల పాటు సాగింది.  2009 ఎన్నికల మొదలు 2018 ఎన్నికల వరకు బ్రదర్స్​ రాజకీయంగా చక్రం తిప్పారు. వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్​ రెడ్డి 2009 ఎన్నికల్లో ఫస్ట్​ టైం భువనగిరి ఎంపీగా, వారి అనుచరుడు చిరుమర్తి లింగయ్య నకిరేకల్​ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి భువనగిరి ఎంపీ సెగ్మెంట్​ పరిధిలోని నియోజక వర్గాల్లో బ్రదర్స్​హవా నడిచింది. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య  ఓడిపోవడంతో కొంత గ్రాఫ్​ తగ్గినట్టు కనిపించింది.

కానీ, లోకల్​బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజగోపాల్​ రెడ్డి గెలుపొందడంతో మళ్లీ జోష్​ పెరిగింది. ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్​ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో బ్రదర్స్‌ తీవ్ర మనస్తాపం చెందారు. ముఖ్యంగా పీసీసీ పదవి వస్తదని ఆశించిన వెంకటరెడ్డికి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, రేవంత్​ రెడ్డి రూపంలో గట్టిషాక్ తగిలింది. తర్వాత 2018 ఎన్నికల్లో వెంకటరెడ్డి ఓడిపోగా, రాజగోపాల్​ రెడ్డి, చిరుమర్తి లింగయ్య గెలుపొందారు.  వెంకటరెడ్డి ఆ మరుసటి ఏడాది జరిగిన ఎంపీ ఎలక్షన్లో భువనగిరి నుంచి గెలిచారు. కానీ ఎమ్మెల్యేలుగా గెలిచిన రాజగోపాల్​రెడ్డి, లింగయ్య ఇద్దరు చెరోదారి చూసుకోవడంతో వెంకటరెడ్డి కాంగ్రెస్​లో ఒంటివారయ్యారు. 

మునుగోడు బైపోల్​నుంచే కౌంట్​డౌన్​...

మునుగోడు బైపోల్​నుంచే వెంకటరెడ్డి కౌంట్​ డౌన్​ మొదలైందని ఆయన వ్యతిరేకవర్గం చెబుతోంది. ఆ ఎన్నికల్లో రాజగోపాల్​ రెడ్డికి వెంకటరెడ్డి సహరించారని, పార్టీ నుంచి వెళ్లిపోవాలని రేవంత్​ రెడ్డి వర్గం బాహాటంగానే విమర్శ లు చేసింది. నిజానికి బైపోల్​లో రాజగోపాల్​ రెడ్డి గెలిస్తే బ్రదర్స్​రాజకీయం ఇంకోరకంగా ఉండేది. కానీ, రెండు సార్లు పీసీసీ పదవి మిస్సవడం, రాజగో పాల్​ రెడ్డి, లింగయ్య పార్టీ నుంచి వెళ్లిపోవడం లాంటి సంఘటనలు వెంకటరెడ్డిని రాజకీయంగా దెబ్బతీశాయి. దీంతో చాలా రోజులు వెంకటరెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీన్ని అదునుగా భావించిన పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం నల్గొండ, నకిరే కల్​, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు యత్నిస్తున్నారు. పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి సపోర్ట్​తో కొందరు, జానారెడ్డి వర్గం పేరుతో ఇంకొందరు రాజకీయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఎంపీ చెప్పినోళ్లుకు టికెట్లు దక్కేనా..?

పార్టీలోకి వ్యతిరేక వర్గం బలపడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో వెంకటరెడ్డి పాత్ర ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మునుగోడు, భువనగిరి, ఆలేరు, నకిరేకల్​, తుంగతుర్తి సెగ్మెంట్లలో ఇటు రేవంత్​, అటు జానారెడ్డి వర్గం టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నకిరేకల్​ లాంటి చోట్ల ఖమ్మం మాజీ ఎంపీ పొంగులే టి శ్రీనివాస్ రెడ్డి ఇన్వాల్​అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంకట్‌ రెడ్డి చెప్పినోళ్లకు టికెట్లు వస్తాయా..? అనే చర్చ జరుగుతోంది.  

నల్గొండ నుంచే పోటీచేస్తానని ప్రకటించిన వెంకటరెడ్డి అవసరమైతే తన సీటును బీసీల కోసం త్యాగం చేస్తానని ప్రకటించారు. కానీ, కొద్దిరోజులకే తిప్పర్తి మండలంలోని తిప్పాలయగూడెం అమ్మవారి టెంపుల్​ నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.  అయితే ఆయన ఇన్నాళ్లు భువనగిరిపైనే ఫోకస్‌ చేయడంతో నల్గొండలో కేడర్​చెల్లాచెదురైంది. పాత టీమ్​ను తనదారిలోకి తెచ్చుకోవాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు.