సిటీలో కస్టమర్లకు రికవరీ ఏజెంట్ల వేధింపులు
‘‘ఎల్బీనగర్కు చెందిన రవి ఐదేండ్ల కిందట ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకుని ట్రాన్సాక్షన్స్ చేస్తుండు. గతేడాది కరోనా టైమ్లో రూ.70వేలు క్రెడిట్ వాడుకొని పేమెంట్స్ చెల్లించకపోవడంతో వడ్డీ, ఫైన్లు కలిపి ప్రస్తుతం రూ.1.2 లక్షలు పెండింగ్ ఉంది. దీంతో రికవరీ ఏజెంట్ కొద్దిరోజుల కిందట అతని కుటుంబసభ్యులకు కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడారు. పేమెంట్ చేస్తామని చెప్పినా వినకుండా రవి ఫ్రెండ్స్, బంధువులకు కూడా కాల్స్ చేసి డబ్బు కట్టాలని ఒత్తిడి చేశారు. 15 ఫోన్ నంబర్లతో కాల్స్ చేస్తూ అసభ్యంగా తిట్టడడంతో భరించలేక మూడు రోజుల కిందట రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కంప్లయింట్చేసిండు.’’
‘‘హయత్నగర్కు చెందిన ప్రైవేట్ ఎంప్లాయ్ సందీప్ రూ.25 వేల లిమిట్ ఉన్న యాక్సిస్ క్రెడిట్ కార్డ్ తీసుకుండు. గతేడాది ఆగస్టులో కార్డులోని మొత్తం అమౌంట్ వాడేసుకుండు. తిరిగి పేమెంట్ చేయలేకపోతుండగా ఎనిమిది నెలల్లో రూ.58 వేలు అయింది. దీంతో కొద్దిరోజులుగా రికవరీ ఏజెంట్స్ అతనికి కాల్స్ చేసి తీవ్రంగా వేధిస్తున్నారు. పలు ఫోన్ నంబర్లతో కాల్స్ చేసి అసభ్యంగా తిట్టడడమే కాకుండా ఇంట్లోని మహిళల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు.’’
హైదరాబాద్, వెలుగు:సిటీలో క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ లోన్ ఏజెన్సీ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. లోన్ యాప్స్ తరహాలోనే కాల్సెంటర్స్ ఏర్పాటు చేసుకుని కస్టమర్లను వేధిస్తున్నారు. ఇండ్లపై దాడులు చేసి భయాందోళనకు గురి చేస్తూ.. అసభ్యంగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా కాల్స్ చేసి మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. కస్టమర్ బంధువులు, ఫ్రెండ్స్ కు కూడా కాల్స్ చేసి వెంటనే చెల్లించకుంటే పరువు తీస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఏజెంట్ల వేధింపులతో గ్రేటర్లోని సైబర్ క్రైమ్, లా అండ్ పీఏలకు నెల రోజుల వ్యవధిలో 15 కంప్లయింట్వచ్చాయి. వీటిలో బాధితులు ఇచ్చిన ఆధారంగానే కేసులు నమోదు చేస్తున్నారు.
థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా..
సిటీలో సుమారు 180కి పైగా రికవరీ ఏజెన్సీలు పని చేస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంక్లతో పాటు పబ్లిక్ సెక్టార్లోని బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్, లోన్ రికవరీ కోసం ఏజెంట్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేయించి, థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా రికవరీ ప్రాసెస్ చేస్తుంటాయి. లోన్ ఇచ్చే ముందుగానే అన్ని డాక్యుమెంట్స్ తీసుకోవడమే కాకుండా, శాంక్షన్అయిన తర్వాత ఈఎమ్ఐలుగా చెల్లించే విధంగా లీగల్ అగ్రిమెంట్స్ చేసుకుంటాయి. ఇందులో భాగంగా కస్టమర్ల ఫోన్ నంబర్లు, అడ్రెస్, ష్యూరిటీస్కి సంబంధించిన వివరాలను తీసుకుంటాయి.
అనంతరం సంబంధిత బ్యాంక్లు, సంస్థలు థర్డ్ పార్టీ ఏజెన్సీలకు లోన్ కస్టమర్ల వివరాలు అందిస్తాయి. రికవరీ చేసిన సొమ్ములో ఏజెంట్లకు ఆయా సంస్థలు కమీషన్స్ ఇస్తుంటాయి. ఈ క్రమంలో లోన్, క్రెడిట్ కార్డ్ రికవరీ ఆపరేషన్స్ ఏజెన్సీలు నిర్వహిస్తుంటాయి. రికవరీ ఏజెన్సీ సంస్థలు రౌడీ షీటర్లు, ఆవారాలను కూడా ఏజెంట్లుగా నియమించుకుంటున్నాయి.
ఫోన్ డేటా ఆధారంగా కాల్స్
అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ లోన్లు తీసుకున్న వారు కొన్ని సందర్భాల్లో ఈఎమ్ఐ చెల్లించేందుకు ఇబ్బందులు రావొచ్చు. దీంతో వడ్డీ, ఫైన్లు వేస్తుంటే పెరిగిపోయి లోన్ క్లియర్ చేయలేకపోతుంటారు. ఇలాంటి వారికి రికవరీ ఏజెంట్ల వేధింపులు తీవ్రమవుతున్నాయి. కస్టమర్ల ఫోన్ డేటా ఆధారంగా కాల్స్ చేస్తున్నారు. నంబర్లు మార్చుతూ అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. డబ్బులు చెల్లించిన వారి వద్ద కూడ సర్వీస్ చార్జ్లు లేట్ ఫీజుల పేరుతో వసూలు చేస్తున్నా రు. బాధితుల ఇండ్లకు వచ్చి హంగామా చేస్తున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులు, వెహికల్స్ బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కస్టమర్లపై దాడులు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి.
తీవ్రతను బట్టి కేసులు నమోదు
క్రెడిట్ కార్డ్స్, లోన్ రికవరీ ఏజెన్సీలకు బ్యాంకులు గైడ్ లైన్స్ ఇస్తుంటాయి. కాల్ సెంటర్ నుంచి కస్టమర్లకు వెళ్లే ప్రతి కాల్ రికార్డ్ అవుతుంది. థర్డ్ పార్టీ సంస్థలు, ఏజెంట్స్ కస్టమర్లతో అసభ్యంగా మాట్లాడితే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారు. బాధితులు డైరెక్ట్ గా సంబంధిత బ్యాంకులకు వెళ్లి కంప్లయింట్ చేయొచ్చు. థర్డ్ పార్టీ ఏజెన్సీల వేధింపులు, టెలీ కాలర్స్ తిట్టడం వంటి వాటిపై కంప్లయింట్ వస్తుండగా, తీవ్రతకు బట్టి కేసులు రిజిస్టర్ చేస్తాం. – కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్స్.