- తాము సూచించిన వారికి కాదని మరొకరికి హెడ్మాస్టర్ గా అవకాశం కల్పించినందుకు ఎయిడెడ్ యాజమాన్యం కినుక
- కరోనా సెలవులతో తనిఖీలు ఉండవని రెచ్చిపోయిన ఎస్పీజీ ఎయిడెడ్ స్కూల్ యాజమాన్యం
- హెడ్మాస్టర్ విజయరాణి పై బహిరంగంగా వేధింపులు
- కర్నూలు జిల్లా నంద్యాలలో ఘటన
- ఎస్పీజీ ఎయిడెడ్ స్కూలు యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ టీచర్ల ఆందోళన
- పాఠశాల ఎదుట బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన
కర్నూలు: హెడ్మాస్టర్ విజయరాణి కి బాధ్యతలు అప్పగించకుండా ఎస్పీజీ ఎయిడెడ్ స్కూల్ యాజమాన్యం వారం రోజులుగా స్కూలుకు తాళం వేస్తోంది. యాజమాన్యం సూచించిన వారికి కాకుండా మరొకరికి హెడ్మాస్టర్ బాధ్యతలు ఎంఇఓ అప్పగించారని కినుక వహించి బాధ్యతల అప్పగింతకు ససేమిరా అంటూ నిరాకరించింది. అంతేకాదు వారం రోజులుగా స్కూలుకు తాళం వేసి విధులకు హాజరయ్యేందుకు వచ్చిన హెడ్మాస్టర్ ను వెనక్కు పంపిస్తోంది. దీనిపై స్పందించిన బహుజన టీచర్స్ ఫెడరేషన్ మరికొందరు ఉపాధ్యాయులతో కలసి శనివారం ఆందోళన ప్రారంభించింది. అక్రమంగా జూనియర్ ఉపాధ్యాయుడికి హెడ్మాస్టర్ ఎలా కల్పిస్తారని.. ప్రశ్నిస్తూ స్కూలు మెయిన్ గేటు వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతలు అప్పగించకుండా వేధింపులకు గురిచేస్తున్నారని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.సతీష్ కుమార్ మాట్లాడుతూ.. హెడ్ మాస్టర్ విధులకు ఎస్పీజీ ఎయిడెడ్ స్కూల్ యాజమాన్యం ఉద్దేశ పూర్వకంగా విధులకు ఆటంకం కలిగిస్తోందని ఆరోపించారు. గత నెల 30 వ తేదీన హెడ్మాస్టర్ విధుల నుండి రిటైర్ అయిన మేరీ కృపావతి స్థానం లో నిబంధనలకు విరుద్ధంగా 8 సంవత్సరాలు జూనియర్ కెనడిని హెడ్ మాస్టర్ గా నియమించడం ఆశ్చర్యకరమన్నారు. దీనిపై పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయురాలు ఎంఎఫ్ఏ విజయరాణి అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాను స్పందించి పరిస్థితిని నంద్యాల మండల విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లగా నంద్యాల ఎంఇఓ బ్రహ్మం వెంటనే కెనడిని తప్పించి హెడ్మిస్ట్రెస్ గా ఎంఎఫ్ఏ విజయరాణి ని నియమిస్తూ ఈనెల 1వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు. ఆరోజు నుంచి ఇవాళ్టి వరకు హెడ్మాస్టర్ గా MFA విజయరాణి విధుల్లో చేరేందుకు.. చార్జీ తీసుకొనుటకు వెళ్తున్నా పట్టించుకోకుండా స్కూలుకు తాళం వేస్తూ వెనుదిరిగి వెళ్లేలా చేస్తున్నారు. కరోనా సెలవులు కావడంతో ఎలాంటి తనిఖీలు లేకపోవడంతో వేధింపుల పర్వం కొనసాగించాలని ప్రయత్నించడం దురదృష్టకరమని, రిటైర్ అయిన కృపావతి కానీ, కొత్తగా వచ్చిన కెనడి కానీ మరియు పాఠశాల యాజమాన్యం కానీ సహకరించకుండా స్కూల్ కు తాళాలు వేసి ఆటంకం చేస్తూ, అవమానపరుస్తున్నారని సతీష్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వము ద్వారా జీతం పొందుకుంటున్న విజయరాణి కి హెడ్మిస్ట్రీస్ విధులకు అప్పగించకుండా, స్కూల్ కు తాళాలు వేసి వారం రోజులుగా అవమాన పరుస్తున్న ఎస్పీజీ ఎయిడెడ్ యాజమాన్యం చర్యలను బహుజన టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తక్షణమే అర్హులైన MFA విజయరాణి ని హెడ్మిస్ట్రీస్ గా విధుల్లో చేరుటకు అవకాశం కల్పించి న్యాయం చేయాలని విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.