దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజూ సుమారు వెయ్యి వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇటీవల జలుబు, దగ్గు, జ్వరం వంటి కరోనా ప్రాథమిక లక్షణాలేవీ కనిపించకుండా పాజిటివ్ వస్తున్న అసింప్టమేటిక్ కేసులు పెరుగుతున్నాయి. ఇది కొంత మేర ఆందోళనకు కారణమవుతోంది. ఇలాంటి కేసుల్లో కరోనా ఉన్నట్లు వారికి అనుమానం కూడా రాదు. ఆరోగ్యంగానే కనిపిస్తున్నప్పటికీ వారి నుంచి కరోనా ఇతరులకు వ్యాపిస్తుంది. దీనివల్ల ఎక్కువ మందికి వైరస్ అంటుకునే ప్రమాదం ఉంది. లాక్ డౌన్ ఉన్నప్పటికీ కరోనా కేసులు పెరగడానికి ఇదో కారణంగా కనిపిస్తోంది. ఈ విషయం గురించి ఇవాళ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ప్రస్తావించారు. మహారాష్ట్రలో ఉన్న కేసుల్లో దాదాపు 75 శాతం వరకు అసింప్టమేటిక్ అని ఉద్ధవ్ చెప్పారు. అలాగే ఢిల్లీలో శనివారం నమోదైన మొత్తం 186 కేసులు ఈ తరహావేనని, ఇది ఆందోళన కలిగిస్తోందని కేజ్రీవాల్ అన్నారు.
ఈ చాలెంజ్ పై అప్రమత్తంగా ఉండాలి
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లెక్కల ప్రకారం అసింటప్టమేటిక్ కరోనా కేసుల సంఖ్య భారీగా ఏమీ లేదని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్. దేశంలో ప్రస్తుతం అసింప్టమేటిక్ కేసులు ప్రస్తుతం ఏమీ పెద్ద చాలెంజ్ కాదని అన్నారు. అయితే దేశ వ్యాప్తంగా ఈ కేసులపై అప్రమత్తంగా ఉండాలని, రాబోయే రోజుల్లో ఈ సవాలును ఎదుర్కొనేందుకు అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఆరోగ్య శాఖ రోజువారీ ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన ఆదివారం సాయంత్రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసింప్టమేటిక్ కేసులను గుర్తించేందుకు ర్యాపిడ్ టెస్టులను వినియోగించాలన్నారు. వృద్ధులు, బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులు, గతంలో ఊపిరితిత్తుల సమస్యలు లాంటి ఉన్న హైరిస్క్ పేషెంట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు లవ్ అగర్వాల్.