పోరు తెలంగాణ : ‘నాన్​ ముల్కీ గో బ్యాక్’ నినాదంతో మొదలు

పోరు తెలంగాణ : ‘నాన్​ ముల్కీ గో బ్యాక్’ నినాదంతో మొదలు

హైదరాబాద్​, వెలుగు: బిందువు బిందువు కలిసి సింధువులా మారినట్టు.. ఒక్కరిద్దరితో మొదలైన తెలంగాణ ఉద్యమం మహోద్యమమైంది. ఆ ఉద్యమానికి బీజం పడింది ‘ఉద్యోగాల’ కోసమే. ముల్కీ (స్థానికుల)కు ఉద్యోగాల్లో తీరని అన్యాయం జరుగుతుండడం, నాన్​ ముల్కీ (స్థానికేతరుల)కు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తుండడంతో విద్యార్థులే ‘ముల్కీ ఉద్యమానికి’ ఊపిర్లూదారు. ఉద్యోగాల బ్యాగ్రౌండ్​తో 1952లో ఓరుగల్లులో టీచర్ల బదిలీల దగ్గర మొదలైన ఆ ఉద్యమం కాస్తా.. నీళ్లు, నిధులను కలుపుకొని ముందుకు సాగింది. సబ్బండవర్గాల పోరాటాలు, నిరసనలు, బలిదానాలు, వంటావార్పులు, సకలజనుల సమ్మెలు, మిలియన్​మార్చ్​లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

పోరు తెలంగాణ : ‘నాన్​ ముల్కీ గో బ్యాక్’ నినాదంతో మొదలు

  • 1952 జులై 26: హనుమకొండ హైస్కూల్​లో స్థానిక టీచర్లను బదిలీ చేసి స్థానికేతరులకు అవకాశం ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు.. అప్పటి డిప్యూటీ డైరెక్టర్​ ఆఫ్​ ఎడ్యుకేషన్​ షెండార్కర్​ వచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా తొలిసారిగా విద్యార్థులు నిరసన చేపట్టారు. 
  • 1952 ఆగస్టు 29: తీవ్రరూపం దాల్చిన విద్యార్థుల నిరసన. వారిపై పోలీసుల లాఠీచార్జ్​. హైదరాబాద్​కూ చేరిన నిరసనలు. 
  • 1952 సెప్టెంబర్​ 2: ‘నాన్​ ముల్కీ’ గో బ్యాక్​, ఇడ్లీ సాంబార్​ ఘర్​ కో జావో, స్టూడెంట్స్​ యూనియన్​ జిందాబాద్​ అంటూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు. 
  • 1952 సెప్టెంబర్​ 3: హైదరాబాద్​లో ర్యాలీలు, సమావేశాలను నిషేధిస్తూ అప్పటి నగర కొత్వాల్​ ఆదేశాలు. వెంకటస్వామి, ముల్చంద్​ లక్ష్మీ నారాయణ, కొండా లక్ష్మణ్​ బాపూజీ వంటి రాజకీయ నాయకులతో పాటు, విద్యార్థులను నిలువరించేందుకు పోలీసుల చర్యలు. దీంతో ఉద్యమం మరింత తీవ్రమైంది. విద్యార్థులకు స్థానికులూ జత కలిశారు. పోలీసులు, విద్యార్థుల మధ్య పరస్పర దాడులు జరిగాయి. పోలీసులు కాల్పులు జరిపారు. ఇద్దరు స్టూడెంట్లు స్పాట్​లోనే చనిపోగా.. ఇంకో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. 
  • 1952 సెప్టెంబర్​ 4: మృతదేహాల కోసం ఉస్మానియా ఆస్పత్రి వద్ద వారి కుటుంబీకులు, విద్యార్థుల ఆందోళన. నిరసన జరుగుతుండగానే పోలీసులు రహస్యంగా మృతదేహాలను మీర్​ ఆలం ట్యాంక్​ సమీపంలో పూడ్చి పెట్టారు. విషయం తెలిసి అప్పటి సీఎం బూర్గుల రామకృష్ణారావు సీరియస్​ అయ్యారు. మృతదేహాలను అప్పగించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే, నిరసనకారులు సీఎం అధికారిక కారును దహనం చేశారు. దీంతో పోలీసులు మళ్లీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోనూ మరో నలుగురు చనిపోయారు. 
  • 1952 సెప్టెంబర్​ 7: ‘ముల్కీ రూల్స్​’ మీద అధ్యయనానికి కేబినెట్​ సబ్​ కమిటీ ఏర్పాటు. పోలీసుల కాల్పుల ఘటనలపై జస్టిస్​ పింగళి జగన్​మోహన్​ రెడ్డి కమిటీ నియామకం.  
  • 1952 డిసెంబర్​ 28: సీఎం బూర్గుల రామకృష్ణారావు, డీజీపీ, ఐజీపీ సహా వంద మందిని విచారించిన జస్టిస్​ పింగళి జగన్మోహన్​ రెడ్డి కమిటీ.. నివేదికను సమర్పించింది. విద్యార్థులు, పోలీసులు సంయమనం పాటిస్తే ఘటన జరిగి ఉండేది కాదని పేర్కొంటూ రిపోర్ట్. రెండు కమిటీల నియామకంతో ఈ ఉద్యమం ఆగింది. 
  • 1953: వివిధ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు. అందులో హైదరాబాద్​ రాష్ట్రాన్ని భాషా ప్రయుక్త ప్రాంతాలుగా విడగొట్టి.. తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్​తో కలిపేందుకు అధ్యయనం. 
  • 1955 మార్చి 5: హైదరాబాద్​ను ఆంధ్రప్రదేశ్​లో కలపడం పట్ల అప్పటి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.  ‘‘ఒక అమాయకపు అమ్మాయిని.. నాటీ అబ్బాయికిచ్చి పెండ్లి చేస్తున్నం. వాళ్లు కలిసి ఉండొచ్చు. ఇమడలేకపోతే విడిపోవచ్చు’’  అని అన్నారు. 
  • 1955 డిసెంబర్​ 3: తెలంగాణ విలీనంపై హైదరాబాద్​ అసెంబ్లీలో తీర్మానం. 174 మంది ఎమ్మెల్యేల్లో (మరాఠీ, కన్నడ వాళ్లు కలిపి) 147 మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 103 మంది తీర్మానానికి ఆమోదం తెలిపారు. 16 మంది న్యూట్రల్​గా, 29 మంది వ్యతిరేకంగా ఓట్​ వేశారు. 94 మంది తెలంగాణ ఎమ్మెల్యేల్లో 25 మంది విలీన తీర్మానాన్ని వ్యతిరేకించారు. 59 మంది ఆమోదించారు. అయితే, ‘ప్రజల ఆకాంక్ష మేరకే విలీనం చేస్తున్నం’ అనే మాటను చేర్చాలంటూ తెలంగాణ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో తీర్మానంపై ఓటింగ్​ జరగలేదు.  
  • 1956 ఫిబ్రవరి 20: విలీనంపై తెలంగాణ, ఆంధ్రా నాయకుల మధ్య రాజీ కుదిర్చేందుకు జెంటిల్​మెన్​ అగ్రిమెంట్​(పెద్దమనుషుల ఒప్పందం).  
  • 1956 నవంబర్​ 1: తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్​గా ఏర్పాటు.