
బిజినెస్ డెస్క్, వెలుగు: అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం ఇన్వెస్టర్లకు శాపంలా మారింది. యూఎస్, యూరప్లకు చెందిన 70 పెద్ద బ్యాంకుల మార్కెట్ క్యాప్ గత 15 రోజుల్లోనే 600 బిలియన్ డాలర్లు (రూ.49 లక్షల కోట్లు) తగ్గింది. ఈ బ్యాంకు షేర్లలో డబ్బులు పెట్టిన ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. యూఎస్ డోజోన్స్ బ్యాంక్ ఇండెక్స్ గత ఐదు సెషన్లలోనే 6 శాతం మేర పతనమైంది. ఈ నెల 6 న యూఎస్లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) దివాలా తీసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే సిగ్నేచర్ బ్యాంక్ కూడా అదే బాట పట్టింది. ఈ ఎఫెక్ట్ యూరప్లో పెద్ద బ్యాంక్ అయిన క్రెడిట్ స్వీస్పై పడింది. ఈ బ్యాంక్ ఎమెర్జెన్సీ ఫండ్స్గా 54 బిలియన్ డాలర్లను స్విస్ సెంట్రల్ బ్యాంక్ నుంచి తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా యూఎస్ రీజనల్ బ్యాంక్ ఫస్ట్ రిపబ్లిక్ దివాలా అంచుల్లో ఉంది. ఈ బ్యాంక్ను కాపాడడానికి టాప్ బ్యాంకులు ముందుకొచ్చి 30 బిలియన్ డాలర్లు సాయం అందించినా, ఇంకా పరిస్థితులు కుదుటపడలేదనే చెప్పాలి. యూఎస్ స్టాక్ మార్కెట్లు శుక్రవారం సెషన్లో భారీగా పడడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు ఇన్వెస్టర్లు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారని, పరిస్థితులను చక్కదిద్దే స్థితిలో యూఎస్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉందని ఎనలిస్టులు, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే 200 బిలియన్ డాలర్ల సాయాన్ని అందించిందని అంటున్నారు. క్రెడిట్ స్వీస్ ఇష్యూ ఆ బ్యాంక్కు సంబంధించిందేనని, ఈ బ్యాంక్ సమస్యను మొత్తం బ్యాంకింగ్ సెక్టార్కు ఆపాదించొద్దని నాట్వెస్ట్ గ్రూప్ పీఎల్సీ చైర్మన్ హావర్డ్ డేవిస్ పేర్కొన్నారు. యూరోపియన్ బ్యాంకింగ్ సెక్టార్ బలంగా ఉందని, సరిపడినంత క్యాపిటల్ అందుబాటులో ఉందని అన్నారు. ఈ విషయాలను ఆర్బీసీ బ్లూబే అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మార్క్ డౌడింగ్ పంచుకున్నారు. క్రెడిట్ స్వీస్, ఎస్వీబీ ఇష్యూ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్కు పోలినట్టే ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయని అన్నారు. ‘గ్లోబల్ ఫైనాన్షిల్ క్రైసిస్ వచ్చిన టైమ్లో బ్యాంకులపై రెగ్యులేషన్స్ తక్కువగా ఉండేవి. లెవరేజ్ ఎక్కువగా తీసుకున్నాయి. క్యాపిటల్ బేస్ను సరిగ్గా మెయింటైన్ చేసేవి కావు. ముఖ్యంగా యూఎస్ మోర్టగేజ్ సెగ్మెంట్ బలహీనంగా మారడం వలన గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ స్టార్టయ్యింది. 2023 లో బ్యాంకింగ్ సెక్టార్ డిఫరెంట్గా ఉంది’ అని మార్క్ డౌడింగ్ వివరించారు. యూఎస్ పెద్ద బ్యాంకుల షేర్లు పడినా, ప్రస్తుత క్రైసిస్ వలన ఎక్కువగా లాభపడేది ఇవేనని అన్నారు. వీటిలోకి రీజనల్ బ్యాంకుల నుంచి కస్టమర్లు, డిపాజిట్లు పెరుగుతాయని చెప్పారు. పెద్ద బ్యాంకులు కాన్ఫిడెంట్గా ఉన్నాయని, అందుకే ఫస్ట్ రిపబ్లిక్కు 5 బిలియన్ డాలర్ల చొప్పున సాయం అందించాయని పేర్కొన్నారు.
186 యూఎస్ బ్యాంకులు రిస్క్లో..
వడ్డీ రేట్లు పెరగడం, ఇన్సూరెన్స్ లేని డిపాజిట్లు ఎక్కువగా ఉండడం వలన యూఎస్లోని 186 బ్యాంకులకు దివాలా రిస్క్ పెరిగిందని రిపోర్ట్ ఒకటి పేర్కొంది. సోషల్ సైన్స్ రీసెర్చ్ నెట్వర్క్లో ‘మానిటరీ టైటినింగ్ అండ్..’ పేరుతో ఈ రిపోర్ట్ పోస్ట్ అయ్యింది. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత నుంచి బ్యాంకులకు వచ్చిన లాస్ (ఇంకా బుక్ చేయని నష్టం) ను ఈ రిపోర్ట్ ప్రస్తావించింది. కొత్త బాండ్లు ఎక్కువ రిటర్న్ ఇస్తే, పాత ట్రెజరీ నోట్లు, బాండ్ల వాల్యూ పడిపోతుందని తెలిపింది. యూఎస్లో 2,50,000 డాలర్ల వరకు ఉన్న డిపాజిట్లకే ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ లేని డిపాజిట్లు త్వరగా విత్డ్రా అయితే, ఇన్సూరెన్స్ ఉన్న డిపాజిట్లు కూడా ఇదే బాట పట్టొచ్చని ఈ రిపోర్ట్ వెల్లడించింది. కాగా, యూఎస్ బ్యాంకులు పెరుగుతున్న వడ్డీ రేట్లకు హెడ్జింగ్ తీసుకోలేదనే భావించి ఈ రిపోర్ట్ ను రెడీ చేశారు.
క్రెడిట్ స్వీస్ కొననున్న యూబీఎస్!
క్రెడిట్ స్వీస్ బిజినెస్లను కొనుగోలు చేసేందుకు యూబీఎస్ బ్యాంక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. స్విస్ రెగ్యులేటరీలు కోరడంతో కొనుగోలుకు ఉన్న అవకాశాలను విశ్లేషిస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. మరోవైపు బ్లాక్రాక్ కూడా క్రెడిట్ స్వీస్ను కొననుందని వార్తలొచ్చాయి. వీటిని ఈ కంపెనీ తోసిపుచ్చింది.