న్యూఢిల్లీ: మారుతి సుజుకి ఇండియా లాభం జూన్ 2022 క్వార్టర్లో రెట్టింపయింది. అంతకు ముందు ఏడాది మొదటి క్వార్టర్లో కంపెనీకి రూ. 475 కోట్ల లాభం రాగా, ఈ ఏడాది మొదటి క్వార్టర్లో అది రూ. 1,036 కోట్లకు పెరిగింది. జూన్ 2022 క్వార్టర్లో అమ్మకాలు రూ. 26,512 కోట్లకు చేరినట్లు మారుతి సుజుకి వెల్లడించింది. కిందటి ఏడాది జూన్ త్రైమాసికంలో ఈ సేల్స్ రూ. 17,776 కోట్లే. కొవిడ్ లాక్డౌన్లు, షట్డౌన్ల వల్ల అంతకు ముందు ఏడాది జూన్ క్వార్టర్లో పెర్ఫార్మెన్స్ ఎఫెక్టయిందని మారుతి సుజుకి తెలిపింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో మొత్తం 4,67,931 వెహికల్స్ అమ్మినట్లు పేర్కొంది. అంతకు ముందు ఏడాది జూన్ క్వార్టర్లో ఈ అమ్మకాలు 3,53,614 యూనిట్లు మాత్రమే. దేశీయ మార్కెట్లో సేల్స్ 3,98,494 యూనిట్లని, 69,437 వెహికల్స్ను ఎగుమతి చేశామని వివరించింది.
జూన్ 2021 క్వార్టర్లో దేశీయ అమ్మకాలు 3,08,095 యూనిట్లు. స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన జూన్ 2022 త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 1,013 కోట్లు. ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత ఇంకా వెంటాడుతోందని, దీంతో ఈ ఏడాది మొదటి క్వార్టర్లో 51 వేల వెహికల్స్ ప్రొడక్షన్ చేయలేకపోయామని మారుతి సుజుకి ఇండియా వెల్లడించింది. జూన్ 2022 చివరి నాటికి కస్టమర్ల నుంచి వచ్చిన 2.8 లక్షల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయని, వీలైనంత త్వరగా ఆ వెహికల్స్ను అందించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామని పేర్కొంది. కమోడిటీస్ రేట్లు పెరిగిన ఎఫెక్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్పై పడినట్లు కూడా మారుతి సుజుకి ఇండియా వివరించింది. వెహికల్స్ రేట్లను పెంచడం కొంత మేరకే సాధ్యమైందని పేర్కొంది.