భార్య, పిల్లల్ని అతడే తోసేశాడా?.. మెదక్ కోర్టు వద్ద జరిగిన ఘటనలో భర్తపైనే అనుమానాలు

భార్య, పిల్లల్ని అతడే తోసేశాడా?.. మెదక్ కోర్టు వద్ద జరిగిన ఘటనలో భర్తపైనే అనుమానాలు

మెదక్, వెలుగు : మెదక్‌‌‌‌ పట్టణంలోని కోర్టు బిల్డింగ్‌‌‌‌ పైనుంచి శనివారం రాత్రి దంపతులు, పిల్లలు కిందపడిన ఘటనలో భర్తపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌‌‌‌కు చెందిన నవీన్‌‌‌‌, అతడి భార్య రమ్య, ఇద్దరు పిల్లలు రుత్విక, యశ్విక శనివారం రాత్రి కోర్టు బిల్డింగ్‌‌‌‌ పైనుంచి దూకిన విషయం తెలిసిందే. ఇందులో నవీన్‌‌‌‌తో పాటు ఇద్దరు పిల్లలు గాయపడగా... అతడి భార్య రమ్య అక్కడికక్కడే చనిపోయింది. అయితే నవీన్‌‌‌‌ గత చరిత్ర, అతడి వ్యవహార శైలిని బట్టి అతడే ప్లాన్‌‌‌‌ ప్రకారం భార్యాపిల్లలను కోర్టుకు తీసుకొచ్చి బిల్డింగ్‌‌‌‌ పైనుంచి తోసేశాడని ఇటు పోలీసులు, అటు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

పెళ్లయినప్పటి నుంచే వేధింపులు

రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌‌‌‌కు చెందిన నడిమింటి బాలరాజుగౌడ్, రాజమణి దంపతుల కూతురు రమ్యకు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌‌‌‌కు చెందిన డాకోళ్ల నవీన్‌‌‌‌గౌడ్‌‌‌‌తో 2019లో పెండ్లి జరిగింది. పెండ్లి జరిగిన కొన్ని రోజుల నుంచే నవీన్‌‌‌‌ భార్య రమ్యను వేధిస్తుండడంతో 2020లో అతడిపై వరకట్న వేధింపుల కేసు నమోదు అయింది. తర్వాత లోక్‌‌‌‌ అదాలత్‌‌‌‌లో కాంప్రమైజ్‌‌‌‌ అయ్యారు. అయితే దంపతుల మధ్య మళ్లీ గొడవలు జరగడంతో రమ్య తల్లిగారి ఇల్లయిన లక్ష్మాపూర్‌‌‌‌కు వచ్చేసింది.

దీంతో ఆగ్రహానికి గురైన నవీన్‌‌‌‌ గత జనవరిలో లక్ష్మాపూర్‌‌‌‌కు వచ్చి అత్తారింటిపై పటాకులు వేసి భయభ్రాంతులకు గురి చేయగా.. ఈ విషయంలో నవీన్‌‌‌‌పై కేసు నమోదు అయింది. కొన్నాళ్లు జైలులో ఉండి బయటకు వచ్చిన నవీన్‌‌‌‌ నెలన్నర కింద తల్లిదండ్రులు, బంధువులతో కలిసి లక్ష్మాపూర్‌‌‌‌ వచ్చి పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ప్రవర్తన మార్చుకుంటానని, భార్యబిడ్డలను సరిగా చూసుకుంటానని హామీ ఇచ్చి వారిని దౌల్తాబాద్‌‌‌‌ తీసుకుపోయాడు. శనివారం ఫ్రెండ్‌‌‌‌ బైక్‌‌‌‌పై భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి మెదక్‌‌‌‌ కోర్టు వద్దకు వచ్చి బిల్డింగ్‌‌‌‌ పైనుంచి దూకాడు.

రెండు గంటలు బిల్డింగ్‌‌‌‌పైనే...

భార్యాపిల్లలతో మెదక్ పట్టణంలోని జిల్లా కోర్టుకు వచ్చిన నవీన్‌‌‌‌ సాయంత్రం 6.20 గంటలకు బిల్డింగ్‌‌‌‌పైకి ఎక్కినట్లు తెలిసింది. రాత్రి 8.30 గంటల తర్వాత పైనుంచి దూకగా.. 8.45 గంటలకు విషయం వెలుగుచూసింది. ఈ రెండు గంటల పాటు నవీన్ ఫ్యామిలీ ఎక్కడ ఉంది ? అక్కడ ఏం చేశారన్నది అంతుచిక్కడం లేదు. నవీన్‌‌‌‌ ముందుగా భార్య రమ్య, పిల్లలను బిల్డింగ్‌‌‌‌ పైనుంచి కిందకు తోసి, తర్వాత తాను దూకి ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నవీన్‌‌‌‌ సికింద్రాబాద్‌‌‌‌ గాంధీ హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటుండగా... రుత్విక, యశ్విక డిశ్చార్జ్‌‌‌‌ అయ్యారు. రమ్య తల్లి రాజమణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ మహేందర్‌‌‌‌ తెలిపారు.