తమతో పాటే సర్కారు బడికి..మెదక్ జిల్లాలో పలువురు ప్రభుత్వ టీచర్ల ఆదర్శం

తమతో పాటే సర్కారు బడికి..మెదక్ జిల్లాలో పలువురు ప్రభుత్వ టీచర్ల ఆదర్శం

మెదక్/శివ్వంపేట/పాపన్నపేట, వెలుగు:ఆర్థికంగా ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు వారి పిల్లలను ప్రైవేట్​స్కూళ్లలో చదివించడం చూస్తుంటాం. ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్​టీచర్లు, మెరుగైన వసతులు ఉన్నా సర్కారు బడుల్లో చేర్పించేందుకు వెనుకాడుతారు. ఇంకొంతమంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వేలాది రూపాయల ఫీజులు చెల్లించి మరీ ప్రైవేట్​స్కూళ్లలో పిల్లలను చేర్పిస్తారు.

ఇలాంటి పరిస్థితుల్లోమెదక్​జిల్లాలో కొందరు ప్రభుత్వ టీచర్లు వారి పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 10 మంది ప్రభుత్వ టీచర్లు వారు పనిచేస్తున్న స్కూళ్లలోనే 14 మంది పిల్లలను చేర్పించి చదివిస్తున్నారు. ఇలా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తున్న ప్రభుత్వ టీచర్లలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఐదుగురు మహిళా టీచర్స్ సైతం వారి పిల్లల్ని సర్కార్ బడిలో చేర్పించారు. కొందరు తమ ఇద్దరు పిల్లలను ప్రభుత్వ స్కూల్​లోనే చదివిస్తున్నారు. 

ఇద్దరు కొడుకులను..

సిద్దిపేట జిల్లా రాయపోల్ కు చెందిన ప్రభుత్వ టీచర్​ కుమార స్వామి శివ్వంపేట మండలం రూప్లా తండా జీపీ పరిధిలో ఉన్న పాండ్యా తండా స్కూల్​లో టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ స్కూల్​లోనే చదివిస్తున్నారు. పెద్ద కొడుకు సాకేత్ రాయపోల్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో 6వ తరగతి, చిన్న కొడుకు అఖిలేశ్వర్ రాయపోల్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ లో 4వ తరగతి చదువుతున్నారు. 

ప్రైవేట్ నుంచి సర్కార్ బడికి

నిజాంపేట మండలం  నార్లాపూర్ కు చెందిన వేముల ప్రవళిక రామాయంపేట మండలం రాయిలాపూర్ ప్రైమరీ స్కూల్ లో టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కొడుకు కార్తీక్ గతేడాది వరకు రామాయంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో సెకండ్ క్లాస్ వరకు చదివాడు. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో మెరుగైన విద్య అందుతుందన్న ఉద్దేశ్యంతో ప్రవళిక తన కొడుకును రాయిలాపూర్ ప్రైమరీ స్కూల్ లో చేర్పించారు. పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి స్కూల్ టీచర్ శ్రావణ్ కుమార్ తన కొడుకును ప్రైవేట్  స్కూల్ లో కాకుండా తాను పనిచేస్తున్న ప్రభుత్వ స్కూల్​లోనే చదివిస్తున్నారు.