
- హుస్నాబాద్లో మెడికల్ పీజీ కాలేజీ ఏర్పాటు చేస్తాం
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
- హుస్నాబాద్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభం
- హాజరైన మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి, పొన్నం
సిద్దిపేట, వెలుగు : పేదల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సమాజంలో మార్పు రావాలంటే విద్య, వైద్యం, నైపుణ్యాలు ఎంతో కీలకమని చెప్పారు. హుస్నాబాద్ పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన సభలో రాజనర్సింహ మాట్లాడుతూ.. ఒకప్పుడు నక్సల్స్, కమ్యూనిస్ట్ ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ ఇప్పుడుకాంగ్రెస్ ప్రాంతమన్నారు. హుస్నాబాద్లో ఆసుపత్రికి 50 సీట్లతో పీజీ మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఓ నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ గొంతును పార్లమెంట్లో వినిపించిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని కొనియాడారు.
పొన్నం కృషి వల్లే హుస్నాబాద్కు శాతావాహన వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ వచ్చిందన్నారు. మహిళా సాధికారితతోనే మార్పు సాధ్యం అవుతుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి పాల్గొన్నారు. అనంతరం మహిళా సంఘాలకు రూ. 71.30 కోట్ల చెక్కులను అందజేశారు.
పదేండ్ల విధ్వంసం నుంచి బయటపడుతున్నాం : మంత్రి తుమ్మల
గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గత ప్రభుత్వం ప్రారంభించి వదిలేసిన ప్రతి పనిని పూర్తి చేస్తామని చెప్పారు. అధికారం కోల్పోయిన లీడర్లు తమను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా అరచేతిలో స్వర్గం చూపెట్టడం లేదన్నారు. మరికొన్ని రోజుల్లో సీఎం చేతుల మీదుగా నర్మెట ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని ప్రకటించారు.
ఫస్ట్ తేదీనే జీతాలిస్తున్నం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
గత ప్రభుత్వంలో వారానికి మూడు జిల్లాల చొప్పున ఉద్యోగులకు జీతాలు ఇచ్చేవారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ తారీఖునే జీతాలు ఇస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ను అభివృద్ధి చేస్తున్నారన్నారు. హుస్నాబాద్ నుంచి సుందరగిరి వరకు ఫేజ్ 2 పనులను రెండు రోజుల్లో, సుందరగిరి నుంచి కొత్తపల్లి వరకు నాలుగు లేన్ల రహదారి పనులు పది రోజుల్లో ప్రారంభం అవుతాయన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ను గత ప్రభుత్వం ఎందుకు
పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
హుస్నాబాద్ను అభివృద్ధిలో ముందుంచుతా : మంత్రి పొన్నం ప్రభాకర్
తక్కువ సమయంలోనే హుస్నాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్ గౌరవాన్ని పెంచుతూ అన్ని రంగాల్లో ముందంజలో ఉంచుతానని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తికి కృషి చేయడంతో పాటు కాల్వలు, భూసేర పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.