బీజేపీ డకౌట్​.. కాంగ్రెస్​ రనౌట్ కేసీఆర్​ సిక్సర్​​ కొడ్తరు : హరీశ్​రావు

బీజేపీ డకౌట్​.. కాంగ్రెస్​ రనౌట్ కేసీఆర్​ సిక్సర్​​ కొడ్తరు : హరీశ్​రావు

కామారెడ్డి/కోరుట్ల, వెలుగు:  వచ్చే ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్​పార్టీదేనని, బీజేపీ డక్​అవుట్​అయితదని, కాంగ్రెస్​ రన్​ అవుట్​అయితదని, కేసీఆర్ సిక్సర్​క ఒట్టి ​హ్యాట్రిక్ సీఎం అవుతారని మంత్రి హరీశ్​రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్​అభ్యర్థులను ప్రకటించి 40 రోజులైనా కాంగ్రెస్​ఇప్పటికీ టికెట్లు ఇయ్యలేకపోతున్నదన్నారు. టికెట్ల కోసం ఫీజు వసూలు చేశారని, ఇప్పుడు టికెట్లు అమ్ముకునే ప్రోగ్రామ్​నడుస్తోందని  విమర్శించారు. ఆయన శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్​జిల్లాలో పర్యటించారు. కామారెడ్డి జిల్లా  బిచ్​కుంద, నిజామాబాద్​జిల్లా ధర్పల్లిలో నిర్మించే100 పడకల హాస్పిటల్స్ కు, ధర్పల్లిలో  సెంట్రల్​ లైటింగ్, వాడిలో బ్రిడ్జి నిర్మాణం, చీమన్​పల్లిలో పీహెచ్​సీ భవనాలకు శంకుస్థాపన చేశారు. 

అనంతరం జరిగిన సభల్లో మాట్లాడారు. ఇప్పుడే అభ్యర్థులను ప్రకటిస్తే  లీడర్లు తన్నుకుంటారని, ఆఫీసులు పగులుతాయని, పైసలు తిన్న సంగతి బయట పడుతుందని కాంగ్రెస్​ పార్టీ వాళ్లు భయపడుతున్నారన్నారు. టికెట్లే ఇచ్చుకోలేని పార్టీ రేపు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తుందని ప్రశ్నించారు. గవర్నమెంట్​స్కూల్​పిల్లలకు పొద్దున బ్రేక్ ఫాస్ట్​ కార్యక్రమాన్ని  ప్రారంభించామని, కాంగ్రెస్​, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో  పిల్లలకు గొడ్డుకారం, అన్నం మాత్రమే పెడుతుంటే కేసీఆర్​మమకారంతో కూడిన ఆహారం ఇస్తున్నారన్నారు. అభివృద్ధికి కొనసాగించేందుకు మూడోసారి కూడా బీఆర్ఎస్​ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కేసీఆర్​హాట్రిక్​సీఎం అవుతారని అన్నారు. వేలాదిమందికి ఉపాధి ఇచ్చిన బీడీ  కార్మికులకు అన్యాయం చేస్తూ కాంగ్రెస్​ హయాంలో  బీడీ కట్టల మీద పుర్రె గుర్తు వేస్తే,  బీజేపీ జీఎస్టీ విధించిందన్నారు. అలాంటి పార్టీలకు బీడీ కార్మికులు  ఓట్లు ఎలా వేస్తారన్నారు.   

పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధం 

పదేళ్ల బీఆర్ఎస్​పాలనకు, గతంలో పదేళ్ల కాంగ్రెస్​పాలనకు చర్చ పెడదామని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, దీన్ని స్వాగతిస్తున్నామని మంత్రి హరీశ్​రావు అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో రూ. 16.80 కోట్ల నూతనంగా నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి బిల్డింగ్​ను మంత్రి ప్రారంభించారు.​ అనంతరం మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో మాట్లాడారు. 

పాత పదేళ్ల పాలన బాగుందనీ రేవంత్​రెడ్డి అంటున్నారని, అప్పుడు రేవంత్​ టీడీపీలో ఉన్నారని, అసెంబ్లీ లో మాట్లాడిన రికార్డులు తీయాలన్నారు. గెలిచేది బీఆర్ఎస్​ అని, హ్యాట్రిక్​ కొట్టేది సీఎం కేసీఆర్​అని,  ఈసారి ఎన్నికల్లో బీజేపీ డక్​అవుట్, కాంగ్రెస్​రన్​అవుట్​అని, బీఆర్ఎస్​ సీఎం కేసీఆర్​ సిక్సర్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.