
- సాగులో మన రాష్ట్రమే నంబర్ వన్
- మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
వికారాబాద్, వెలుగు: ఆయిల్ పామ్ పంటల సాగుకు తెలంగాణ భూములు అనుకూలంగా ఉన్నాయని, సాగులో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కొత్రేపల్లిలోని ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ వ్యవసాయ క్షేత్రంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు వస్తాయని, మూడేళ్ల పాటు అంతర్గత పంట కింద కూరగాయలు సాగు చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్కు కూరగాయలు ఎగుమతి చేయాలని, అందుకు అవసరమైన సౌలతులు కల్పిస్తామన్నారు.
గత ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా, రేవంత్ సర్కార్ రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. త్వరలో పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. వికారాబాద్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్పీకర్ మాట్లాడుతూ.. రైతు భరోసాను ఎకరాకు రూ.12 వేలకు పెంచి 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాలో వేశామన్నారు. పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ యాస్మీన్ బాషా, డిప్యూటీ డైరెక్టర్ నీరజ గాంధీ, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ పాల్గొన్నారు.