
- ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: పటాన్చెరు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడుతున్న కాలనీల సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీహెచ్ఈఎల్ మెట్రోఎన్క్లేవ్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధి కోసం రూ. 7 కోట్ల నిధులు వెచ్చించామని పేర్కొన్నారు. గుడి, మసీదు, చర్చి నిర్మాణాలకు రూ.30 లక్షల సొంత నిధులు ఇచ్చానని, మరో రూ.70 లక్షలతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. కొత్త వాటర్ రిజర్వాయర్లతో చుట్టు పక్కల 20 కాలనీలకు తాగునీరు సరఫరా చేస్తున్నామని, అభివృద్ధి విషయంలో అందరూ కలిసి రావాలని ఆయన కోరారు.
అనంతరం ఆషాడ మాస బోనాల నిర్వహణపై పటాన్చెరులోని కోదండ సీతారామస్వామి దేవాలయంలో పట్టణ పెద్దలతో సమావేశంలో నిర్వహించారు. పండితులు సూచించిన ప్రకారం జూలై 21 న బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేటర్ కుమార్ యాదవ్, సుధాకర్ రెడ్డి, దేవానందం, నర్సింహా గౌడ్, సత్యనారాయణ, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. అనంతరం కాలికి సర్జరీ చేయించుకొని సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎంపీ రఘునందన్రావుని పరామర్శించారు.