జాతరకు హైటెక్ హంగులు

జాతరకు హైటెక్ హంగులు
  • మేడారం అంతటా సీసీ కెమెరాల నిఘా
  • కమాండ్ కంట్రోల్ ​ద్వారా పర్యవేక్షణ
  • సమగ్ర సమాచారంతో మొబైల్ యాప్​
  • అన్ని శాఖలకు వాట్సప్​ గ్రూపులు 

ములుగు, వెలుగు: కాలంతోపాటే మేడారం జాతర మారుతోంది. భక్తుల భద్రత, వసతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మోడర్న్​టెక్నాలజీని వాడుకుంటున్నారు. మొబైల్​యాప్​, సీసీ కెమెరాలు, కమాండ్​ కంట్రోల్ రూం, వాట్సప్​గ్రూపులు.. జాతరలో కీ రోల్​పోషిస్తున్నాయి. జాతరలో ఏది ఎక్కడుందీ.. ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.. తదితర సమగ్ర సమాచారంతో  యాప్​అందుబాటులోకి తెచ్చారు.  ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారికి, కొత్తగా వచ్చేవారికి ఉపయోగపడేలా ఈ యాప్​తయారు చేశారు. అమ్మవార్ల గద్దెలతోపాటు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్, మెడికల్, ఆర్టీసీ సేవలు, ఇతర సౌకర్యాల రూట్​మ్యాప్​ఇందులో పొందుపర్చారు. ​జీపీఎస్​ట్రాకింగ్​తో లింక్ చేయడం వల్ల భక్తులు కావాలనుకున్న చోటికి ఈజీగా చేరుకోవచ్చు. తప్పిపోయిన వారి వివరాలను కూడా యాప్​లో  పోస్టు చేసే సౌలత్​ ఉంది. జాతరలో  అన్ని సర్వీస్​ ప్రొవైడర్ల  సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ శాఖల వారీగా వాట్సప్​గ్రూపులను క్రియేట్​ చేసి సంబంధిత ఆఫీసర్లు ఎప్పటికప్పుడు అప్​డేట్ చేస్తున్నారు. అన్ని గ్రూపులను కలెక్టర్​టచ్​లో ఉండే నాలుగు గ్రూపులతో లింక్​చేశారు. డ్రింకింగ్​ వాటర్, మరుగుదొడ్లు, పార్కింగ్​ ప్లేస్​లకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా గ్రూపులో పోస్ట్​ చేయగానే.. ఆ ఏరియాలో ఉన్న  సిబ్బంది అటెండయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. గద్దెల దగ్గర పోలీసు డెన్ లో కమాండ్​కంట్రోల్​ రూం ఏర్పాటు చేశారు. అమ్మవార్ల గద్దెలు, చిలుకలగుట్ట, రెడ్డిగూడెం, ఆర్టీసీ, మెడికల్ క్యాంపులు, జంపన్నవాగు, నార్లాపూర్​ ఏరియాల్లో 380 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.  కంట్రోల్​ రూం నుంచి ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఈ కంట్రోల్​ రూంకు ములుగు ఏఎస్పీ సుధీర్​రాంనాథ్​కేకన్​ఇన్​చార్జీగా ఉన్నారు. జాతర ఏరియాను నాలుగు సెక్టార్లు, 8 జోన్లుగా విభజించారు.  ఆయా జోన్లలో డ్యూటీ చేసే ఆఫీసర్లు వాకీటాకీలతో సిబ్బందిని గైడ్ చేస్తున్నారు.

కోఆర్డినేషన్​తో సేవలు 
మేడారం జాతరకొచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం. అన్ని శాఖలతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం. కమాండ్ కంట్రోల్​ రూం నుంచి వెహికల్స్​రద్దీని పరిశీలిస్తూ ట్రాఫిక్​ జామ్​ నివారించేందుకు సూచనలు చేస్తున్నాం.  ఏ ఆపద వచ్చినా జాతరలో డ్యూటీ చేస్తున్న  10,500 మంది పోలీసు ఆఫీసర్లు, సిబ్బంది వెంటనే స్పందిస్తారు. 
- సుధీర్​ రాంనాథ్​ కేకన్​, ఏఎస్పీ, ములుగు