
అంఫన్ తుఫాన్ దెబ్బకు పశ్చిమ బెంగాల్ విలవిలలాడుతోంది. తుఫాన్ ధాటికి బెంగాల్లో 80 మంది చనిపోయారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు బెంగాల్ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోడీకి ఎయిర్ పోర్టులో గవర్నర్ జగదీప్ దినకర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతం పలికారు. వారితో కలిసి మోడీ అంఫన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
అంఫన్ తుఫాన్ బెంగాల్లో తీవ్ర విధ్వంసం స్పష్టించింది. తుఫాన్ ధాటికి ఒక్క కోల్కతా సిటీలోనే 15 మంది మరణించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో భయంకర గాలులతో బెంగాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గాలుల వేగానికి రేకుల షెడ్లు, ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్లపై కరెంటు స్తంబాలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. మట్టి ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బుర్ద్వాన్, వెస్ట్ మిడ్నాపూర్, హుగ్లీ జిల్లాల్లో వరి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఎక్కువగా చెట్లు విరిగిపడటంతో పాటు గోడలు కూలి మీద పడటంతో చాలా మంది చనిపోయారు.
ఈస్ట్ మిడ్నాపూర్, హౌరా జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. తీర ప్రాంత జిల్లాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దాదాపు వెయ్యి టవర్లు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, దీవులు, సుందర్బన్స్తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని సీఎం తెలిపారు. అంపన్ వల్ల జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేయడానికి కనీసం మూడు నాలుగు రోజులు పట్టొచ్చని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో NDRF బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కూలిన చెట్లను తొలగించి… రోడ్లను క్లియర్ చేస్తున్నాయి.
For More News..