న్యూఢిల్లీ: చాలా రాష్ట్రాలు లాక్డౌన్లను ఎత్తివేస్తుండటంతో సబ్బులు, షాంపూలు, టూత్పేస్టులు వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ అమ్మకాలు మళ్లీ జోరందుకున్నాయి. దీంతో జూన్ మొదటి రెండు వారాలలో ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ సేల్స్ అంతకు ముందు నెలతో పోలిస్తే 15 శాతం పెరిగాయి. కిరాణా దుకాణాలు తిరిగి తెరవడం కూడా అమ్మకాల జోరుకు సాయపడుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కిరాణా షాపుల వల్ల సేల్స్ 28 శాతం దాకా పెరిగాయని పేర్కొంటున్నాయి. అంతకు ముందు రెండు నెలల్లో ట్రెండ్ ఇందుకు భిన్నంగా ఉందని వెల్లడించాయి. దేశంలోని 75 లక్షల రిటెయిల్ స్టోర్ల అమ్మకాలను ట్రాక్ చేసే బిజోమ్ ఈ డేటాను రిలీజ్ చేసింది.
దీపావళి దాకా ఢోకా ఉండదు....
మార్కెట్ మళ్లీ ఊపందుకుందని, దీపావళి దాకా జోరుకు ఢోకా ఉండదని పార్లే ప్రొడక్ట్స్ కేటగిరీ హెడ్ బుద్ధా కృష్ణారావు చెప్పారు. ఎకానమీ రీ ఓపెన్ అయ్యే కొద్దీ గ్రోత్ అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. మాన్సూన్ అనుకూలంగా ఉండటం కూడా ప్లస్ పాయింటేనని చెప్పారు. అన్లాక్తో గ్రామాలలోనూ గ్రోసరీలు, ఎసెన్షియల్స్ వినియోగం లాక్డౌన్ ముందు లెవెల్స్కు చేరుతోందని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాలు అన్లాక్ అవుతుండటంతో చ్యవన్ప్రాశ్, హనీ వంటి ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్ డిమాండ్ పెరుగుతున్నట్లు డాబర్ వెల్లడించింది. హెల్త్కేర్ పోర్ట్ఫోలియో అమ్మకాలు పెరుగుతున్నాయి. రూరల్ ఇండియాలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోందని డాబర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్) ఆదర్శ్ శర్మ చెప్పారు. కొవిడ్–19 కేసుల తగ్గుదల కన్జూమర్ సెంట్మెంట్ను బూస్ట్ చేస్తోందని అన్నారు. అలాగే, సప్లయ్ చెయిన్లో ఏర్పడిన ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయని పేర్కొన్నారు. సెకండ్వేవ్ ఎఫెక్ట్ ఎక్కువవడంతో ఏప్రిల్ నుంచి కొన్ని మార్కెట్లలో లాక్డౌన్ మొదలయింది. కిందటి నెలలోనైతే రెండు డజన్ల రాష్ట్రాలలో రెస్ట్రిక్షన్లు, నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నాయి. దాంతో మార్కెట్ మూడో వంతుకు పడిపోయింది. షాపులు క్లోజ్ అయి ఉండడంతో డిమాండ్ పడిపోయింది.
రెండంకెల గ్రోత్......
అన్ని ఎఫ్ఎంసీజీ కేటగిరీలలోని ప్రొడక్ట్స్ అమ్మకాలూ రెండంకెల గ్రోత్ను జూన్ మొదటి రెండు వారాలలో సాధించాయని మొబిసీ టెక్నాలజీస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అక్షయ్ డిసౌజా చెప్పారు. బిజోమ్ ఈ కంపెనీదే. రికవరీ మరింత పటిష్టంగా ఉంటుందనే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. హోమ్కేర్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అమ్మకాలైతే మార్చి కంటే కూడా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. హైజీన్, హోమ్ కన్సంప్షన్కు సెకండ్వేవ్ మేలు చేసింది. కానీ, హోటల్స్, రెస్టారెంట్లు, కేటరింగ్ బిజినెస్లను మాత్రం బాగా దెబ్బకొట్టిందని ఎనలిస్టులు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో తప్ప మిగిలిన ప్రాంతాలలో హోటళ్లు, రెస్టారెంట్ల బిజినెస్లు రికవరీ అవుతున్నాయని అదాని విల్మార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంగ్శు మాలిక్ చెప్పారు.