
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దారుణ ఘటన జరిగింది. ముగ్గురు పిల్లలకు ఉరివేసి ఓ తల్లి ఆత్మహత్యకు ఒడిగట్టింది. స్థానిక రాంనగర్లో ఉండే ఉమారాణి అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు బుధవారం రాత్రి ఉరివేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఉరివేసుకొని చనిపోయింది. కాగా.. పిల్లలకు చీరతో ఉరివేయడంతో ఒక చిన్నారి మెడ నుంచి చీర జారిపోయింది. దాంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. గురువారం ఉదయం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతులను ఉమారాణి (32), పిల్లలు హర్షిణి (14), లక్కీ(10)గా గుర్తించారు. ప్రాణాలు దక్కించుకున్న చిన్నారిని శైనీగా పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.