
వోయేజర్2 సౌరమండలాన్ని దాటేసి నక్షత్ర మండలంలోకి వెళ్లింది. తన సిస్టర్ స్పేస్క్రాఫ్ట్ వోయేజర్1ను అనుసరించింది. నిజానికి రెండు స్పేస్క్రాఫ్ట్లను కొద్ది రోజుల తేడాతోనే పంపించింది నాసా. వోయేజర్1ను 1977 సెప్టెంబర్ 5న ప్రయోగిస్తే, వోయేజర్2ను దాని కన్నా ముందే అంటే 1977 ఆగస్టు 20న ప్రయోగించింది. దీన్నే ముందు ప్రయోగించినా, నక్షత్ర మండలంలోకి మాత్రం లేటుగా అడుగుపెట్టింది. 2018 నవంబర్ 5న వోయేజర్2.. నక్షత్ర మండలంలోకి చేరిందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ లోవా సైంటిస్టులు నిర్ధారించారు. ‘‘వోయేజర్2 నక్షత్రమండలంలోకి వెళ్లేటప్పుడు సౌర గాలులు దానిపై పెద్ద ప్రభావాన్నే చూపించాయి. గతంలో వోయేజర్1కూ అదే జరిగింది. కానీ, ప్లాస్మా, హీలియోస్ఫియర్ను దాటుకుని ఆ రెండు నక్షత్ర మండలంలోకి అడుగు పెట్టడం అద్భుతమే” అని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రయోగించిన 42 ఏళ్లకు వోయేజర్2 నక్షత్రమండలాన్ని దాటింది. దాని ప్రయాణంలో భాగంగా ప్లాస్మా, చార్జ్డ్ పార్టికల్స్, గ్యాస్లో మార్పులను స్పేస్క్రాఫ్ట్ కనిపెట్టిందని సైంటిస్టులు చెబుతున్నారు. సౌర మండలాన్ని దాటే క్రమంలో నక్షత్ర మండలానికి సమీపంలో ప్లాస్మా సాంద్రత పెరిగినట్టు వోయేజర్2 పరికరాలు గుర్తించాయన్నారు. సూర్యుడికి రక్షణ కవచంలా ఉండే హీలియోస్ఫియర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చంటున్నారు.