- ఇక తుక్కుకేనా..!
- ట్రామా కేర్ సెంటర్ అంబులెన్స్పై ఆఫీసర్ల నిర్లక్ష్యం
- అరకోటితో తెచ్చి మూలకు పడేసిన్రు
- యాక్సిడెంట్ బాధితులకు అందని ట్రీట్మెంట్
కొద్ది రోజుల కింద హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు భిక్కనూర్ సమీపంలో హైవేపై యాక్సిడెంట్కు గురైంది. గాయపడిన ఇద్దరిని ట్రీట్మెంట్ కోసం కామారెడ్డి హాస్పిటల్కు తీసుకొచ్చారు. ప్రాధమికంగా చికిత్స చేసి హైదరాబాద్ హాస్పిటల్కు తీసుకెళ్లాలని సూచించడంతో ప్రైవేట్ అంబులెన్స్లో తరలించారు. అయితే వాస్తవానికి హైవేలపై యాక్సిడెంట్ జరిగితే తక్షణమే ట్రీట్మెంట్ అందించి వారి ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో ట్రామా కేర్ సెంటర్ ఉంటుంది.. కామారెడ్డిలో ఉన్న సెంటర్ను ఆఫీసర్లు నిర్లక్ష్యం చేయడంతో క్షతగాత్రులకు ఇబ్బందులు తప్పడం లేదు.
కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి జిల్లా మీదుగా ప్రస్తుతం రెండు హైవేలు ఉన్నాయి. జిల్లాలో యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా అవుతుంటాయి. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వైళ్లే నేషనల్ హైవేపై ప్రతి నెలలో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతాయి. యాక్సిడెంట్లు జరిగినప్పుడు గాయపడిన వారికి సకాలంలో మెరుగైన ట్రీట్మెంట్ అందించే ఉద్దేశంతో 12 ఏండ్ల కింద కామారెడ్డికి రూ.4.50 కోట్లతో ట్రామా కేర్ సెంటర్ శాంక్షన్ చేశారు. ఇందుకు అప్పట్లో ఏరియా హాస్పిటల్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో ట్రీట్మెంట్కు అవసరమైన అధునాతన అంబులెన్స్కు రూ.50 లక్షల ఖర్చు చేసి తీసుకొచ్చారు.
సకల వసతులు
ట్రామా కేర్ సెంటర్ కోసం తీసుకొచ్చిన అంబులెన్స్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి. తీవ్ర గాయాలైన వారికి అవసరమైతే ఆపరేషన్ కూడా అందులోనే చేయవచ్చు. ఇందుకు అవసరమైన అన్ని పరికరాలు, ఆక్సీజన్ వంటి సౌకర్యాలు ఇందులో ఉంటాయి. అంబులెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క పేషేంట్కు ఇది ద్వారా ఉపయోగపడిన దాఖలాలు లేవు. అసలు ఎప్పుడు కూడా వాడలేదు. కొన్నాళ్ల కింద హాస్పిటల్లో గొడవ జరిగినప్పుడు కొందరు వ్యక్తులు అంబులెన్స్ను పగులగొట్టారు. మళ్లీ ఆఫీసర్లు రిపేరు చేయించించారు. తర్వాత కూడా వినియోగించకుండా మూలన పడేశారు. లోపల పరికరాలు, ఇతర వస్తువులు తుప్పు పట్టాయి.
ప్రైవేట్ లేదా హైదరాబాద్కే...
భిక్కనూర్ మండలం నుంచి సదాశివనగర్ వరకు హైవేపై నిత్యం ఏదో ఓ యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ట్రీట్మెంట్ కోసం గాయాలైన వారిని జిల్లా హాస్పిటల్కు తీసుకొస్తారు. ఇక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ చేసిన అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్కు, లేదా హైదరాబాద్కు పంపుతున్నారు. అధునాతన పరికరాలు ఉన్న అంబులెన్స్ మూలన పడడంతో రోగుల సంబంధికులు వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ అంబులెన్స్ను మాట్లాడుకొని వెళ్లాల్సి వస్తోంది. కొన్ని సార్లు సకాలంలో ట్రీట్మెంట్ అందక చనిపోతున్న ఘటనలు ఉన్నాయి. ఉన్నతాధికారులు చొరవ చూపి అంబులెన్స్ను అందుబాటులో కి తీసుకురావాలని కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
ట్రామ్ కేర్ సెంటర్కు కేటాయించిన అంబులెన్స్ కొద్ది రోజుల కింద పాడైంది. యాక్సిడెంట్జరిగిన పెషేంట్లకు ట్రీట్మెంట్ ఇక్కడే చేస్తున్నాం. పరిస్థితి సీరియస్గా ఉంటే మెరుగైన చికిత్స కోసం మరో వెహికల్లో హైదరాబాద్కు పంపుతున్నాం. ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి అంబులెన్స్ను రిపేర్ చేయిస్తాం.
- డాక్టర్ శ్రీనివాస్, ఆర్ఎంవో, కామారెడ్డి