
హైదరాబాద్ : కరోనా ఎఫెక్ట్తో రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్కే పరిమితమైన ఐటీ ఎంప్లాయీస్ను పూర్తిస్థాయిలో ఆఫీసులకు రప్పించేందుకు ఐటీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి తర్వాత కరోనా తీవ్రత తగ్గడంతో మెల్లమెల్లగా ఎంప్లాయీస్ ఆఫీసులకు రావడం మొదలుపెట్టారు. కానీ చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్కే ఇంట్రెస్ట్ చూపించడంతో కంపెనీలు హైబ్రిడ్ మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. మూడు రోజులు ఆఫీస్, రెండు రోజులు ఇంటి నుంచి చేయాలంటూ ఎంప్లాయీస్కు ఆఫర్ ఇచ్చాయి. అయితే అది కూడా అనుకున్నంత సక్సెస్ ఫుల్గా కొనసాగడంలేదు. ఇప్పటికీ చాలామంది పూర్తిస్థాయి వర్క్ ఫ్రమ్ హోమ్కే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కచ్చితంగా రమ్మని పిలిస్తే జాబ్ మానేస్తామంటూ తేల్చిచెప్తున్నారు. దీంతో కంపెనీలు కూడా ఎంప్లాయీస్ మీద ఒత్తిడి తీసుకురావడం లేదు. అయితే వారికి ఆఫీసుకు వచ్చి పనిచేసే విధంగా ఆసక్తి కల్పించేందుకు ‘బ్యాక్ టు ఆఫీస్’ పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాయి. గేమ్స్, ఫుడ్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ ఉండేలా ఈవెంట్ ప్లానర్లతో ప్రోగ్రామ్లు ఏర్పాటు చేయిస్తున్నాయి.
అందరూ కలిసేలా..
కరోనా నుంచి ఇప్పటివరకు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలోనే పనిచేస్తున్నారు. వీరిలో కొందరు సొంతూళ్లలో ఉంటూ అక్కడి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పని చేశారు. ఈ ఏడాది పరిస్థితులు మాములు స్థితికి రావడంతో చాలామంది సొంతూళ్ల నుంచి సిటీకి వచ్చినప్పటికీ ఆఫీసుకు వచ్చి వర్క్ చేసేందుకు సిద్ధంగా లేమని మేనేజ్ మెంట్కు చెప్తున్నారు. చాలామంది కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వారున్నారు. వారందరూ గత రెండున్నరేళ్లుగా ఒకరితో ఒకరికి నేరుగా పరిచయం లేకుండా జాబ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ ఒకసారి గెట్ టు గెటర్ లాగా కలిసే ఏర్పాట్లు బాగుంటుందనే ఉద్దేశంతో మీటప్ పార్టీలు నిర్వహిస్తున్నాయి.
ప్లానర్లతో పార్టీల ఏర్పాటు..
రెండు నెలల నుంచి ఐటీ సెక్టార్లో ఈ తరహా ఈవెంట్లు ఎక్కువగా జరుగుతున్నట్లు ఈవెంట్ ఆర్గనైజర్లు చెప్తున్నారు. రిసార్టులు, బాంకెట్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, పబ్లు, రెస్టారెంట్లలో గెట్ టు గెదర్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారన్నారు. ఎంప్లాయీస్ సంఖ్యను బట్టి ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నామంటున్నారు. ఈ రకమైన ఈవెంట్లకు ఎంప్లాయీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని కంపెనీల హెచ్ఆర్లు చెప్తున్నారు.
ఈ నెలలో 28 ఈవెంట్లు చేశాం...
ఎంప్లాయీస్ను ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేసేలా ఈవెంట్లు ఉంటాయి. కార్పొరేట్ సంస్థల నుంచి చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు. 2 నెలల నుంచి బ్యాక్ టు ఆఫీస్ ఈవెంట్లు చాలా అవుతున్నాయి. ఒక రోజు 7 ఈవెంట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో 28 ప్రోగ్రామ్స్ చేశాం. ఫుడ్, స్టేజ్ షోలు, సాంగ్స్, డ్యాన్స్లు, గేమ్స్ అన్నీ ఉండేలా గెట్ టు గెదర్ పార్టీలను కండక్ట్ చేస్తున్నాం. ఆకట్టుకునేలా డెకరేషన్ , సెల్ఫీ బూత్ కూడా పెడుతున్నాం. - అరుణ్, ఈవెంట్ ప్లానర్
మేనేజర్లతో మీట్...
మా కంపెనీలో వీకెండ్స్ లో గెట్ టు గెదర్ ఈవెంట్లు కండక్ట్ చేస్తున్నారు. కొత్తగా జాయిన్ అయినవారితో పాటు సీనియర్ ఎంప్లాయీస్ సైతం ఒకరికొకరు కలిసేలా ప్లాన్ చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో ఒక రెస్టారెంట్లో మా మేనేజర్తో కలిసి డిన్నర్ ప్లాన్ చేశారు. టీమ్ మెంబర్స్ అంతా వచ్చారు. ఎంప్లాయీస్కు వర్క్ ఫ్రమ్ ఆఫీసుపై ఇంట్రెస్ట్ కోసం అన్నీ కంపెనీలు ఇలా ప్లాన్ చేస్తున్నాయి. - శ్రీధర్ మెరుగు, ఫౌండర్,
ఐటీ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ ఫోరమ్..కొత్త ఎక్స్పీరియన్స్..
కరోనా టైమ్ లో జాబ్ వచ్చినప్పటినుంచి సొంతూరి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. ఏడాదిన్నర నుంచి ఆన్ లైన్ లో మీటింగ్ లు తప్ప నేరుగా మా కొలిగ్స్, టీమ్ మెంబర్స్ను కలవలేదు. ఇటీవల సిటీలోని ఓ ఓ పబ్లో గెట్ టు గెదర్ కండక్ట్ చేశారు. వీకెండ్ కావడంతో టీమ్ మెంబర్స్, కంపెనీలో పనిచేసే కొలిగ్స్, బెంగుళూరు నుంచి మా మేనేజర్ సైతం వచ్చారు. ఆఫీసులో చాలా టీమ్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాయి. సింగర్స్ తో లైవ్ మ్యూజిక్ ప్లాన్ చేశారు. ఫస్ట్ టైం ఆఫీస్ వాళ్లను కలవడం, పార్టీ కొత్త ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది. - రేణు, ఐటీ ఎంప్లాయ్