ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు: నిరంజన్ రెడ్డి

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు: నిరంజన్ రెడ్డి

వ్యవసాయం బలోపేతం చేయడానికే సీఎం కేసీఆర్ పంటల మార్పిడికి శ్రీకారం చుట్టారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. దేశంలో ఏటా 22 మిలియన్ టన్నుల నూనెలు అవసరమవుతాయని తెలిపారు. అయితే ఇందులో ఎక్కువ మొత్తం నూనెలు విదేశాల నుండి దిగుమతి అవుతున్నాయని చెప్పారు. 

ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహానికి జిల్లాల వారీగా జోన్లను విభజించి కంపెనీలకు అప్పజెప్పామని చెప్పారు. ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 25 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతోందని, ఒక్క వనపర్తి జిల్లాలో ఐదు వేల ఎకరాల్లో పంట సాగు అవుతోందని పేర్కొన్నారు. సంకిరెడ్డిపల్లి దగ్గర ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి శుక్రవారం(సెప్టెంబర్ 29) మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

దేశంలో 35 ఏళ్లలో 39 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతుందన్నారు. గత రెండేళ్లలోపే లక్ష 22 వేల ఎకరాల్లో కొత్తగా సాగు చేపట్టామని.. త్వరలోనే రెండు లక్షల ఎకరాలకు చేరుకుంటామని తెలిపారు. ఈ పంటకు కోతులు, చీడపీడల వంటి బెడదలేని పంట ఇదని చెప్పారు. ఈ సాగు కోసం రైతుకు భరోసానిచ్చే క్రమంలో 40 ఎకరాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి ఫ్యాక్టరీ సంకిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. 

ఫ్యాక్టరీకి అవసరమైన మేరకు ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. వ్యవసాయం బలోపేతం చేసే క్రమంలో కరెంట్, సాగునీళ్లు, రైతుబంధు, రైతుభీమాతో పాటు వందశాతం కొనుగోళ్లు చేపట్టామని నిరంజన్ రెడ్డి చెప్పారు. వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి దగ్గర ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజ చేశారు.