మెడికల్ ​కాలేజీకి బిల్డింగ్స్​ దొరుకుతలే!

మెడికల్ ​కాలేజీకి   బిల్డింగ్స్​ దొరుకుతలే!
  •  అడ్మిషన్ల ప్రక్రియకు గడువు 4 నెలలే 

కామారెడ్డి , వెలుగు: మెడికల్​ కాలేజీకి టెంపరరీ బిల్డింగ్స్​ దొరకక జిల్లా అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అకడమిక్​ ఇయర్​లోనే  కాలేజీలో అడ్మిషన్లు తీసుకోవాలని సీఎం కేసీఆర్​ ఆదేశించడంతో టెంపరరీ వసతులు కల్పించేందుకు కిందా మీదా పడుతున్నారు. జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ​బిల్డింగ్స్​వెతికే పనిలో పడ్డారు. అడ్మిషన్ల ప్రక్రియకు నెలల గడువే ఉండడంతో  టెంపరరీ ప్రైవేట్​బిల్డింగ్స్​దొరకక ఉరుకులు పరుగులు పెడుతున్నారు.  

 గవర్నమెంట్​ బిల్డింగ్​ పనులు షురూ కాలే..

ఏడాదిన్నర కింద  సీఎం కేసీఆర్​కలెక్టరేట్  బిల్డింగ్​ ప్రారంభానికి వచ్చిన సందర్భంగా  జిల్లాకు మెడికల్ కాలేజీ శాంక్షన్​ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారమే వెంటనే మెడికల్ ​కాలేజీ శాంక్షన్​ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.  కాలేజీ,  హాస్పిటల్స్, హాస్టల్స్ నిర్మాణం కోసం రూ.460 కోట్ల ఫండ్స్​ శాంక్షన్​ చేశారు.  కానీ ఇంకా  బిల్డింగ్స్​ నిర్మాణ పనులు షూరు కాలేదు.  దీంతో కొత్త బిల్డిం గ్స్​ నిర్మాణం పూర్తయ్యే వరకు టెంపరరీ  బిల్డింగ్స్​ను సమకూర్చాల్సి ఉంది.  ప్రభుత్వం జిల్లా హాస్పిటల్​కు మెడికల్ కాలేజీ హాస్పిటల్ ను మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది. లెక్చరర్స్​ బిల్డింగ్​,  గర్ల్స్​, బాయిస్​ కోసం వేర్వేరుగా హాస్టల్​ బిల్డింగ్స్​ కావాలి.  కాలేజీ    వసతుల పై ఇటీవల రెండు  సార్లు  నేషనల్ మెడికల్ కౌన్సిల్​ టీమ్స్​ పరిశీలించాయి.  హాస్పిటల్​,  ఎంసీహెచ్​ బిల్డింగ్స్​ను టీమ్​మెంబర్లు పరిశీలించారు.  క్లాసులను  నిర్మాణంలో  ఉన్న  ఎంసీహెచ్​(  మదర్​, చైల్డ్​హాస్పిటల్​) బిల్డింగ్​లో ఏర్పాటు చేస్తున్నారు.  హాస్టల్స్​ కోసం ప్రైవేట్ బిల్డింగ్స్​   వెతుకుతున్నారు.

 గడువులోగా సమకూర్చాలని..

ఈ అకడమిక్​ ఇయర్​లో క్లాసులు  ప్రారంభం కావాలంటే  ముందుగా నేషనల్ మెడికల్ కౌన్సిల్​ పర్మిషన్​ ఇవ్వాలి.  నామ్స్​కు అనుగుణంగా  ఇక్కడ వసతులు సమకూర్చాలి. ఇప్పటికే   రెండు సార్లు  నేషనల్ మెడికల్ కౌన్సిల్ టీమ్స్​పరిశీలించాయి.  రెండో సారి వచ్చినప్పుడు  మరో 3 నెలల్లో మొత్తం పనులు  పూర్తి కావాలని ఇక్కడి ఆఫీసన్లకు సూచించినట్లు తెలిసింది.  అడ్మిషన్లకు కౌన్సెలింగ్​ ప్రక్రియ షురూ అయ్యే లోపు  టీచింగ్​ స్టాప్​, మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది.  ఈ నేపథ్యంలో  జిల్లా హాస్పిటల్​లో,  ఎంసీహెచ్​  బిల్డింగ్​వద్ద కాలేజీ ఏర్పాటు పనులు హడావిడిగా సాగుతున్నాయి.  ఇటీవల హెల్త్​మినిష్టర్ ​హరీశ్​ రావు,  కలెక్టర్​,  ఇతర ఉన్నతాధికారులతో  వీడియో కాన్ఫరెన్స్​లో మెడికల్ కాలేజీ  పనులపై రివ్యూ చేశారు. త్వరగా  పనులు పూర్తి చేయాలని, ఉన్నతాధికారులు ఈ పనులపై ఫోకస్​ పెట్టాలని సూచించారు. 

తాత్కాలిక షెడ్ల నిర్మాణం

జిల్లా హాస్పిటల్​లో ప్రస్తుతం 200 బెడ్స్​ ఉన్నాయి.ఈ హాస్పిటల్​లో మొదట 100 బెడ్స్​కెపాసిటీ ఉన్నప్పటికీ ఇటీవల  రోగుల తాకిడి, డెలివరీల సంఖ్య పెరుగుతుండడంతో అడిషనల్​గా 100 బెడ్స్​ పెంచారు.   మెడికల్​ కాలేజీకి హాస్పిటల్​ కేటాయిస్తుండడంతో  కాలేజీ పర్మిషన్​ రావడానికి 300 బెడ్స్​ అవసరం. మరో 100 బెడ్స్​ పెంచాల్సి ఉంది. ఇప్పటికే బిల్డింగ్​ ఇరుకైంది. దీంతో బిల్డింగ్​పై భాగంలో తాత్కలికంగా షెడ్ల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.