మంచిర్యాల జిల్లాలో రసవత్తరంగా..అవిశ్వాస రాజకీయం

మంచిర్యాల జిల్లాలో రసవత్తరంగా..అవిశ్వాస రాజకీయం
  •     క్యాంపునకు వెళ్లిన బెల్లంపల్లి మున్సిపల్​ కౌన్సిలర్లు 
  •     చైర్​పర్సన్, వైస్​ చైర్మన్​పై తీవ్రస్థాయిలో అసంతృప్తి 
  •     గత నెల 7న నోటీసు ఇచ్చిన 23 మంది కౌన్సిలర్లు 
  •     ఈ నెల 12న మున్సిపల్​ ప్రత్యేక సమావేశం

బెల్లంపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్​ చైర్​పర్సన్​జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్​పై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు ఈ నెల 12న కలెక్టర్ తేదీ ఖరారు చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా బుధవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు క్యాంపుకు బయళ్దేరి వెళ్లారు. మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న 20వ వార్డు బీఆర్ఎస్ ​కౌన్సిలర్ గోశిక రమేశ్, వైస్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న రెండో వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ షేక్ అఫ్సర్ ఆధ్వర్యంలో 12 నుంచి 13 మంది కౌన్సిలర్లు క్యాంపునకు తరలివెళ్లారు.

మున్సిపాలిటీలో వార్డులకు నిధుల కేటాయింపు విషయంలో చైర్​పర్సన్ ​జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్​ వివక్ష చూపారని, నాటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చెప్పినట్టే వింటూ మున్సిపల్ అభివృద్ధిని పట్టించుకోలేదని వీరిద్దరిపై కౌన్సిలర్లు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. మున్సిపల్ చైర్​పర్సన్, వైస్ చైర్మన్​పై అవిశ్వాసాన్ని కోరుతూ డిసెంబర్​7న కలెక్టర్​బదావత్​సంతోష్​కు 23 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసు అందజేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి బెల్లంపల్లి మున్సిపల్​ రాజకీయం పలుపులు తిరుగుతూ ఆసక్తి రేపుతోంది.  

కాంగ్రెస్​లోకి చైర్​పర్సన్

కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేసిన తర్వాత తన పదవికి ముప్పు పొంచి ఉన్నట్టు గమనించిన చైర్​పర్సన్​జక్కుల శ్వేత ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఆ తర్వాత విడతల వారీగా దాదాపు 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మొదటి నుంచి చైర్ పర్సన్​పై అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 11 మంది కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. వైస్​ చైర్మన్​ బత్తుల సుదర్శన్​నేటికీ బీఆర్​ఎస్​లోనే 
కొనసాగుతున్నారు. 

రూ.లక్షల్లో నజరానాలు 

తమ పదవులను కాపాడుకునేందుకు చైర్​పర్సన్, వైస్ ​చైర్మన్లు ప్రయత్నిస్తుండగా.. వారిని గద్దెదించి ఆ పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా చైర్మన్, వైస్​ చైర్మన్​పదవులు ఆశిస్తున్నవారు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన 23 మందికి రూ.లక్షల్లో నజరానా ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక్కో కౌన్సిలర్​కు చైర్మన్ ​అభ్యర్థి రూ.75వేలు

వైస్ ​చైర్మన్​అభ్యర్థి రూ.50వేల చొప్పున ముట్టజెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు ఈ నెల 12 వరకు క్యాంపు ఖర్చులను భరించనున్నారు. అలాగే తమ పదవులను కాపాడుకునేందుకు ప్రస్తుత చైర్​పర్సన్, వైస్ ​చైర్మన్లు కూడా కౌన్సిలర్లకు నజరానాలు ఆశచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎవరి ప్రయత్నాలు వారివే..

అవిశ్వాస క్యాంపుకు వెళ్లిన 12 మందితో పాటు మరికొందరు ఒకటి, రెండు రోజుల్లో క్యాంపునకు చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ చైర్మన్​పదవి ఎస్సీ జనరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన 11 మందిలో 6వ వార్డు కౌన్సిలర్ మాటూరు మధు కూడా ఆ పదవిని ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కు చెందిన 13 వ వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ ఆశిస్తున్నారు. సైలెన్స్​గా ఉన్న మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు

కాంగ్రెస్ లో చేరిన 12 మంది కౌన్సిలర్లు ఎవరికి మద్దతునిస్తారో ఈనెల12న జరిగే మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో తేలే అవకాశాలున్నాయి. మున్సిపాలిటీలో 34 వార్డులకు గానూ మ్యాజిక్​ ఫిగర్​18 ఉండాలి. కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎలా స్పందిస్తారో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.