
కరోనా వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వబోమని మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. థానే మేయర్ నరేశ్ మహస్కే, మున్సిపాలిటీ కమిషనర్ డాక్టర్ విపిన్ వర్మల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఇప్పటికీ కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకోని ఉద్యోగులకు జీతం ఇవ్వకూడదని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనిపై ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గడువు దాటిపోయిన తర్వాత కూడా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకుండా ఉన్న ఉద్యోగులకు కూడా జీతాలు నిలిపేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా రెండో డోసు వ్యాక్సిన్ పూర్తి చేసుకుని వారి వ్యాక్సిన్ సర్టిఫికెట్ను ఆఫీస్లో సబ్మిట్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ఈ నెలాఖరులోపు థానే సిటీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని పని చేస్తున్నామని మేయర్ నరేశ్ తెలిపారు. ఇందుకోసం మంగళవారం భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించామన్నారు. చాలా మంది గడువు ముగుస్తున్నా రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావడం లేదని, ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. భారీగా వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆన్వీల్ వ్యాక్సిన్ సెంటర్లను కూడా పెట్టామని తెలిపారు. ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ల వివరాలు సేకరించి, టీకా వేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇందుకోసం 167 టీమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.