లోన్ మారటోరియం గడువు పొడిగింపు సాధ్యం కాదు

లోన్ మారటోరియం గడువు పొడిగింపు సాధ్యం కాదు

కరోనాతో ఏర్పడిన సంక్షోభం కారణంగా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి ఊరట కలిగిస్తూ కేంద్రం లోన్ మారటోరియం విధించింది. ఈ క్రమంలో వడ్డీపై వడ్డీ, మారటోరియం గడువు పొడిగింపు వంటి అంశాలపై సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంకు(RBI) పలు విషయాలు తెలిపింది. రుణ గ్రహీతలకు కల్పించిన రుణ మారటోరియం పరిధిని మరోసారి పొడిగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. మారటోరియం 6 నెలలకు మించి ఇవ్వడం సాధ్యం కాదని RBI దాఖలు చేసిన అవిడవిట్ లో తెలిపింది. కరోనా కారణంగా నష్టపోయిన ఆయా రంగాలకు మరింత ఆర్థిక ఉపశమనాన్ని అందించలేమని తేల్చి చెప్పింది.

వడ్డీపై వడ్డీని వదులుకోవడంపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన అఫిడవిట్ సంతృప్తికరంగా లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విషయంపై కూడా కేంద్ర సర్కారు స్పష్టతనిచ్చింది. నిర్దిష్ట రంగ ఆధారిత ఆర్థిక ఉపశమన వివరాల్లోకి కోర్టు వెళ్లకూడని కేంద్ర సర్కారు, ఆర్బీఐ తెలిపాయి. మారటోరియం వ్యవధి 6 నెలలకు మించితే మొత్తం చెల్లింపుల తీరుపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేశాయి. వడ్డీపై వడ్డీ మాఫీ చేయడమే కాకుండా ఇతర ఊరట కల్పించినా భారత ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని కేంద్ర సర్కారు తెలిపింది. కరోనా వ్యాప్తికి ముందు రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాలు సంక్షోభంలో పడ్డాయని చెప్పింది. దీంతో ఆయా రంగాల ఇబ్బందులను బ్యాంకింగ్ నిబంధనల ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేసింది.