- రిటైర్మెంట్ కోసం ఎన్పీఎస్ బెటర్
- లాంగ్ టెర్మ్ సేవింగ్స్ స్కీమ్లో పీపీఎఫ్ ట్రై చేయొచ్చు
- రెండింటికి ప్రభుత్వ గ్యారెంటీ
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్గా మంచి స్థాయికి చేరుకోవడానికి ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం. రిస్క్ తీసుకునే స్వభావం బట్టి ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది నిర్ణయించుకోవాలి. రిస్క్ తీసుకోవడానికి వెనకడుగేయని వారు స్టాక్స్లో డబ్బులు పెట్టొచ్చు. రిస్క్ వద్దనుకునేవారు ఎఫ్డీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే తక్కువ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండే ఇన్వెస్టర్లు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) లను ట్రై చేయొచ్చు. పీపీఎఫ్, ఎన్పీఎస్ గురించి పూర్తిగా తెలుసుకుంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం.
పీపీఎఫ్..
పీపీఎఫ్ స్కీమ్ను ప్రభుత్వం నడుపుతోంది. ఇదొక లాంగ్ టెర్మ్ సేవింగ్స్ స్కీమ్. రిటైర్మెంట్ కోసం దీనిని ఎంచుకోవడం ఉత్తమం. పీపీఎఫ్ చాలా సేఫ్ అని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రేటును ఇన్వెస్టర్లు పొందుతారు. ఈ స్కీమ్ కింద ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ, ఒక ఏడాదిలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఈ స్కీమ్ కనీస టెన్యూర్ 15 ఏళ్లు. గరిష్టంగా 50 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయొచ్చు.
ఇన్వెస్టర్లు పీపీఎఫ్ అకౌంట్లో నెల వారి లేదా మూడు నెలలకొకసారి, ఆరు నెలలకొకసారి, ఏడాదికొకసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. ట్యాక్స్ సేవ్ చేసుకోవాలనుకునే వారు కూడా పీపీఎఫ్ను ఎంచుకోవచ్చు. పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్పై వచ్చే వడ్డీ ఆదాయంపై సెక్షన్ 80 సీ కింద ట్యాక్స్ పడదు. ఇండియన్ సిటిజన్ అయి ఉండి 18 ఏళ్లు దాటిన వారెవరైనా పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేయొచ్చు.
నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఐ), హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ (హెచ్యూఎఫ్లు) పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అనర్హులు. అలానే జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కుదరదు. మైనర్ల కోసం పీపీఎఫ్ అకౌంట్ను కుటుంబ సభ్యులు లేదా రిలేటివ్స్ ఓపెన్ చేయొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి క్వార్టర్ (ఏప్రిల్ – జూన్) గాను 7.1 శాతం వడ్డీని ప్రభుత్వం ఇస్తోంది. ఆర్థిక సంవత్సరం చివరిలో వడ్డీని లెక్కిస్తారు. వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. ఏడో ఏట నుంచి పీపీఎఫ్ అమౌంట్ను కొంతమేర విత్డ్రా చేసుకోవచ్చు.
ఎన్పీఎస్..
ఎన్పీఎస్ ఒక వాలంటరీ రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్. ఇది కూడా గవర్న్మెంట్ స్కీమ్. ప్రభుత్వ ఉద్యోగులు (ఆర్మీలో పనిచేస్తున్నవారు మినహా), ప్రైవేట్ ఉద్యోగులు , అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిస్తున్న వారు కూడా ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేయొచ్చు. రిటైర్మెంట్ తీసుకునేటప్పుడు 60 శాతం అమౌంట్ను విత్డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40 శాతం అమౌంట్ను పెన్షన్ కింద ప్రతీ నెల పొందుతారు. సెక్షన్ 80 సీ, సెక్షన్ 80సీసీడీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.
ప్రభుత్వం 9 శాతం నుంచి 12 శాతం రేంజ్లో వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇండియన్ సిటిజన్స్తో పాటు ఎన్ఆర్ఐలు కూడా ఎన్పీఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వయసు 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. ఎన్పీఎస్ అకౌంట్ను కనీసం రూ.500 తో ఓపెన్ చేయాలి. ప్రతీ నెల కనీసం రూ.500 లేదా ఏడాదికి రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు.