NZ vs PAK: పాకిస్తాన్‌ను గెలిపించిన వర్షం.. హోరాహోరీగా సెమీస్ రేసు

NZ vs PAK: పాకిస్తాన్‌ను గెలిపించిన వర్షం.. హోరాహోరీగా సెమీస్ రేసు

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. 21 పరుగుల తేడాతో గెలుపొందింది. 402 పరుగుల లక్ష్య ఛేదనలో మ్యాచ్‌కు పలు మార్లు వర్షం అంతరాయం కలిగించగా.. అటను కొనసాగించడం సాధ్యపడలేదు. దీంతో అంపైర్లు పాకిస్తాన్ జట్టును విజేతగా ప్రకటించారు. 

402 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 21.3 (160/1) ఓవర్ల వద్ద ఉన్నపుడు మొదటిసారి వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు ఆటను కొద్దిసేపు నిలిపేశారు. కొద్దిసేపటి తరువాత తిరిగి ఆట ప్రారంభం కాగా, పాకిస్తాన్ టార్గెట్‌ను 41 ఓవర్లలో 342 పరుగులుగా నిర్ణయించారు. అనంతరం 25.3(200/1) ఓవర్ల వద్ద మరోసారి వర్షం మొదలైంది. ఆపై ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. పాకిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. ఆట నిలిచిపోయే సమయానికి ఫఖర్ జమాన్‌ (106 నాటౌట్; 69 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) బాబర్ అజామ్ (47 నాటౌట్; 51 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజులో ఉన్నారు. 

అంతకుముందు ర‌చిన్ ర‌వీంద్ర‌(108; 94బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్), కేన్ విలియ‌మ్స‌న్ (95; 79 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 402 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.