
- ఇంటింటికీ వెళ్లి వ్యర్థాలు సేకరించి అమ్ముతున్న వైనం
సంబల్పూర్: ఒడిశాలోని సంబల్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ).. చెత్త నుంచి ఆదాయం పొందుతోంది. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి.. అమ్మడం ద్వారా ప్రతి నెల రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల దాకా సంపాదిస్తోంది. ‘‘ఇండ్లు, వ్యాపార సంస్థల నుంచి రీసైకిల్ చేయగలిగిన వ్యర్థాలను సేకరిస్తున్నాం. టెండర్ ప్రాసెస్ ద్వారా ఒక ఏజెన్సీని సెలెక్ట్ చేసి.. ఆ సంస్థకు చెత్తను అమ్ముతున్నాం’’ ఎస్ఎంసీ డిప్యూటీ కమిషనర్ శుభాంకర్ మహంతి తెలిపారు.
బ్యాటరీతో నడిచే 80 వాహనాలతో సహా మొత్తం 130 బండ్ల ద్వారా చెత్తను సేకరిస్తున్నట్లు వివరించారు. ‘‘గ్లాస్, పేపర్, కార్డ్బోర్డ్, మెటల్, ప్లాస్టిక్, టైర్లు, బట్టలతో సహా 16 రకాల రీసైకిల్ చేయగలిగే వ్యర్థాలు ఉన్నాయి. వీటిని ఏజెన్సీకి విక్రయిస్తాం. ఒక్కో ఐటమ్ను ఒక్కో ధరకు అమ్ముతాం. 2021 ఆగస్టు నుంచి ఇలా చెత్తను ఎస్ఎంసీ అమ్ముతున్నది. వెల్త్ సెంటర్లకు వచ్చే డబ్బును.. సిబ్బంది కోసమే ఉపయోగిస్తున్నాం. రీసైకిల్ చేయగలిగే వేస్ట్ను అమ్మడం ద్వారా ఎస్ఎంసీ రూ.25 లక్షలకు పైగా సంపాదించింది” అని తెలిపారు.
ప్రాసెసింగ్ ఇలా..
సంబల్పూర్ సిటీలో రోజూ 110 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ మొత్తం 9 వెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు. తొలుత గృహాలు, వాణిజ్య సంస్థల నుంచి సేకరించిన చెత్తను వెల్త్ సెంటర్లకు తీసుకొస్తారు. ఈ సెంటర్లలో మైక్రో కంపోస్టింగ్ సెంటర్ (ఎంసీసీ), మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (ఎంఆర్ఎఫ్) ఏర్పాటు చేశారు. నగరంలో ఉత్పత్తయ్యే బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను ఎంసీసీలో కంపోస్టుగా మారుస్తారు.
అలాగే నాన్ డీగ్రేడబుల్ చెత్తను ఎంఆర్ఎఫ్కు తెచ్చి వేరుచేస్తారు. సపరేట్ చేసిన తర్వాత రీసైకిల్ చేయడానికి వీలులేని చెత్తను.. ఇంధనంగా ఉపయోగించేందుకు సిమెంట్ ఫ్యాక్టరీకి పంపుతారు. రీసైకిల్ చేయగలిగే
చెత్తను ఏజెన్సీకి అమ్ముతారు.