పాకిస్థాన్ తన వక్రబుద్ధిని చాటుకుంది. దాయాది భారత్పైకి దొంగ దాడులకు పాల్పడే పాక్.. టెర్రరిస్టులను కూడా ఇండియా పైకి ఉసిగొల్పుతోంది. అయితే దీన్ని ఆ దేశం ఎప్పుడూ ఒప్పుకోలేదు. కానీ రీసెంట్గా భారత ఆర్మీకి పట్టుబడిన అలీ బాబర్ అనే టెర్రరిస్టు చేసిన వ్యాఖ్యలతో ఇది నిరూపితమైంది. ఆర్మీ ఎదుట లొంగిపోయిన బాబర్.. లష్కరే తొయిబా లాంటి ఉగ్ర సంస్థలతో కలసి పాక్ ఆర్మీ భారత్పైకి ఉగ్రవాదులను ఎలా ఉసిగొల్పుతోందన్న విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ఆ విషయాలు..
శ్రీనగర్: పాకిస్థాన్ పంజాబ్లోని ఒఖారాకు చెందిన అలీ బాబర్ది చాలా నిరుపేద కుటుంబం. దీన్ని ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా ఆసరాగా తీసుకుంది. కేవలం రూ.50 వేల ఆశచూపి అలీ బాబర్ను టెర్రరిజంలోకి దింపింది. ఇలాంటి మరెంతో మంది అమాయకుల, పేద కుర్రాళ్లను ఉగ్రవాదులుగా మారుస్తూ భారత్పై దాడులకు లష్కర్ సంస్థ, పాక్ ఆర్మీ ఉసిగొల్పుతున్నాయి.
ట్రెయినింగ్ ఇచ్చిన పాక్ ఆర్మీ
జమ్మూ కశ్మీర్లోని ఉరీ సెక్టార్లో రీసెంట్గా భద్రతా దళాలు నిర్వహించిన ఓ ఆపరేషన్లో 19 ఏళ్ల అలీ బాబర్ లొంగిపోయాడు. భారత్లోకి తాను ఎలా వచ్చాడు, ఎందుకు టెర్రరిస్టుగా మారాడన్న విషయాలపై అలీ బాబర్ స్వయంగా సమాధానాలు చెప్పిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. భారత ఆర్మీ విడుదల చేసిన ఈ వీడియోలో బాబార్ మాట్లాడుతూ.. బారాముల్లా జిల్లాలోని పట్టాన్ అనే ప్రాంతానికి మారణాయుధాలను సరఫరా చేసేందుకు గాను తనకు రూ. 20 వేలు అప్పజెప్పారని బాబర్ చెప్పాడు. ఆయుధాలను డెలివరీ చేశాక.. మరో రూ.30 వేలు ఇస్తామని చెప్పారని పేర్కొన్నాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ముజఫరాబాద్లోని ఓ క్యాంప్లో లష్కరే తొయిబాతోపాటు పాక్ ఆర్మీ కలసి సంయుక్తంగా తమకు ట్రెయినింగ్ ఇచ్చాయన్నాడు. మరో ఆరుగురు ఉగ్రవాదుల బృందంతో కలసి ఈ నెల 18న భారత్లోకి చొరబడినట్లు తెలిపాడు. కాగా, గత కొన్నేళ్లలో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్థాన్ టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి అని చెప్పాలి.