బెంగళూరు: పిల్లలు సన్యాసం తీసుకోవడంలో తప్పేమీ లేదని కర్నాటక హైకోర్టు పేర్కొంది. బాల సన్యాసం తీసుకుని, స్వామి అవ్వడంలో చట్టపరమైన ఇబ్బందులు ఉండబోవని కోర్టు స్పష్టం చేసింది. ఉడుపిలోని షిరూర్ మఠం పీఠాధిపతిగా 16 ఏళ్ల అనిరుద్ధ సరళతయ అనే బాలుడ్ని ఎంపిక చేయడాన్ని ప్రశ్నిస్తూ కర్నాటక హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను తోసిపుచ్చిన కోర్టు.. ఏ వయస్సులో సన్యాసం తీసుకోవాలనే దానిపై కచ్చితమైన నియమ, నిబంధనలు లేవని క్లారిటీ ఇచ్చింది.
‘బుద్ధిజం లాంటి ఇతర మతాల్లో పిల్లలు చిన్న వయస్సులో ఉండగానే సన్యాసులుగా మారతారు. ఏ వయస్సులో సన్యాసం తీసుకోవాలనే విషయంపై ఎలాంటి రూల్స్ లేవు. అదే సమయంలో ఒక వ్యక్తి 18 ఏళ్ల లోపు సన్యాసం తీసుకోవాలనే దానిపై చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా ఎలాంటి అడ్డంకులూ లేవు. మతపరంగా చూసుకున్నా.. పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలు సన్యాసం స్వీకరించొచ్చనే ఉంది’ అని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్లో ఉన్నట్లు చట్టపరమైన, రాజ్యాంగపరమైన నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది. గత 800 ఏళ్లుగా ఆ పీఠంలో శ్రీ మధ్వాచార్యుల బోధనల ప్రకారమే సన్యాస స్వీకరణ పద్ధతి కొనసాగుతోందని కోర్టు తెలిపింది.