ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్. దాంట్లో ఓ యూట్యూబ్. ఆ యూట్యూబ్లో లక్షల కొద్దీ ఛానెళ్లు. అన్నింట్లో వంటల ఛానల్స్కు ఉండే క్రేజ్ మాత్రం వేరే లెవెల్. ఆ ఛానళ్లకు లక్షల మంది సబ్స్ర్కయిబర్లు, వేలల్లో వ్యూస్. వంట ఛానెళ్ళతో ఫేమస్ అయిన వారు మస్త్ మంది. అలానే తమిళ నాడుకు చెందిన ఒక మామూలు ‘విలేజ్ కుకింగ్’ ఛానల్కు ఫుల్ క్రేజ్. తమిళనాడులోని మారుమూల పల్లెటూరులో ప్రారంభమైన ఈ ఛానల్ కోటి మంది సబ్స్ర్కయిబర్లను దాటేసింది. వ్యవసాయం చేసుకునే ఆరుగురు చిన్నరైతులు కలిసి స్టార్ట్ చేసిన ఈ చానల్ సరికొత్త రికార్డు సృష్టించింది. వంటలు వండి దాని నుంచి వచ్చే ఆదాయంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ ఫ్రెండ్స్. పల్లె వాతావరణం ఉట్టిపడేలా, చెట్లు, పక్షుల కిలకిలా రావాల మధ్య వంట చేయడం ఆ ఛానల్ స్పెషాలిటీ.
రాహుల్ రాకతో..
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ కూడా విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్లో గరిట తిప్పాడు. 2019లో తమిళనాడులో రాహుల్ ఆ ఛానల్ విజిట్ చేశాడు. అప్పుడు వాళ్లతో కలిసి వంట చేసి, ఆ తర్వాత కలిసి తిన్నారు. దీంతో ఛానల్ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సోషల్మీడియా వింగ్ ఆ వీడియోను షేర్ చేయడంతో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. రాహుల్గాంధీ వంట చేసిన వీడియోను దాదాపు రెండు కోట్ల మంది చూశారు.