- పాతవాటితో సహా మొత్తం 25 బిల్లులు పాస్ చేయించాలని కేంద్రం యోచన
- రాజ్నాథ్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్
- ధరల పెరుగుదల, నిరుద్యోగం, బార్డర్ టెన్షన్స్పై చర్చించాలన్న ప్రతిపక్షాలు
- రూల్స్ ప్రకారం చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు వేళయింది. బుధవారం నుంచి ఈ నెల 29 దాకా సెషన్ కొనసాగనుంది. 17 రోజులపాటు సభ సమావేశం కానుండగా.. కేంద్ర ప్రభుత్వం 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నది. వీటితోపాటు పాతవి కూడా కలిపి మొత్తం 25 దాకా బిల్లులను పాస్ చేయించాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, ప్రహ్లాద్ జోషితోపాటు 30కి పైగా పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఇండో–చైనా బార్డర్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. పార్లమెంట్ రూల్స్ ప్రకారం ఆయా అంశాలపై చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయాలని బీజేడీ, పాపులేషన్ కంట్రోల్ బిల్లును క్లియర్ చేయాలని శివసేన షిండే వర్గం కోరాయి. పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను రాజ్నాథ్ కోరారు. సెషన్ లెజిస్లేటివ్ ఎజెండాను జోషి వివరించారు. బిల్లులు పాస్ చేయడంలో సహకరించాలని ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేశారు.
ధరల పెరుగుదలపై చర్చించండి: కాంగ్రెస్
ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఇండియా చైనా బార్డర్లోని పరిస్థితులపై సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ లోక్సభా పక్ష నేత ఆధిర్ రంజన్ చౌధురి డిమాండ్ చేశారు. కాశ్మీరీ పండిట్ల హత్యలపైనా చర్చ జరగాలన్నారు. క్రిస్మస్ సందర్భంగా సెషన్ ఉండకుండా చూసుకోవాలని ఆధిర్ సూచించారు. సమావేశాలను కుదించాలని తాను చెప్పడం లేదని, అత్యవసరమైతే 25న కూడా సభను నిర్వహించవచ్చని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఇటీవలి ఎలక్షన్ కమిషనర్ నియామకంపై డిస్కస్ చేయాలని కాంగ్రెస్ నేత నాసిర్ హుస్సేన్ కోరారు. రాష్ట్రాలను ఆర్థికంగా దిగ్బంధించడంపై చర్చ జరగాలని టీఎంసీ నేతలు సుదీప్ బంద్యోపాధ్యాయ్, డెరెక్ ఓబ్రెయిన్ డిమాండ్ చేశారు. సభలో ముఖ్యమైన అంశాలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించాలని కోరారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, ఇతర పార్టీలు గొంతెత్తాయి. పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)పై చర్చ పెట్టాలని ఆప్ నేత సంజయ్ సింగ్ చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాల తర్వాత చర్చించాల్సిన అంశాలను
ఖరారు చేస్తామని జోషీ తెలిపారు.
- నిజానికి నవంబర్లోనే శీతాకాల సమావేశాలు జరగాల్సింది. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా నెల రోజులు ఆలస్యంగా మొదలవుతున్నాయి.
- అక్టోబర్లో చనిపోయిన సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్కు.. లోక్సభలో తొలి రోజున నివాళులర్పిస్తారు.
- ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్కర్.. తొలి సారిగా రాజ్యసభ చైర్మన్ హోదాలో సభను నడపనున్నారు.
మూడు బిల్లులపై కాంగ్రెస్ వ్యతిరేకత
నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు.. నేషనల్ నర్సింగ్, మిడ్వైఫరీ కమిషన్ బిల్లు.. కంటోన్మెంట్ బిల్లు.. ఓల్డ్ గ్రాంట్(రెగ్యులేషన్) బిల్లు, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సవరణ) బిల్లు తదితరాలను కేంద్రం ప్రవేశపెట్టనుంది. అయితే బయోలాజికల్ డైవర్సిటీ (సవరణ) బిల్లు, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్(సవరణ) బిల్లు, ఫారెస్ట్ కన్జర్వేషన్ (సవరణ) బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది. వీటిని స్టాండింగ్ కమిటీకి పంపాలని, వీటిపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నది.