తెలుగు రాష్ట్రాల్లో లోన్ల కిస్తీలు చెల్లించక ఇక్కట్లు

తెలుగు రాష్ట్రాల్లో లోన్ల కిస్తీలు చెల్లించక ఇక్కట్లు
  •     భారీగా కేసుల నమోదు
  •     వెల్లడించిన లీగల్ సావీ

హైదరాబాద్​, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో లోన్ల చెల్లింపుల్లో ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. బకాయిలు కట్టకపోవడంతో సంస్థలు, రుణగ్రహీతల మధ్య ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయి. ఫలితంగా లోన్ల వేధింపుల కేసులు గణనీయంగా పెరిగాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 2024లో ఈ రెండు రాష్ట్రాల్లో వేధింపుల కేసులు 41శాతం పెరిగాయి. 2023లో 25,488 కేసులు నమోదు కాగా, 2024లో 35,944కు పెరిగాయి. వ్యక్తిగత లోన్ల చెల్లింపులు ఆరు క్వార్టర్లలో ఎప్పుడూ లేనంతగా 3.6 శాతానికి పెరిగాయి. 

లోన్​ రిజల్యూషన్​ ఫర్మ్ .. లీగల్​ సావీ  ప్రకారం, 2024 నుంచి ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణలో 11 వేల మందికిపైగా రుణగ్రహీతలు రూ. 270 కోట్లకుపైగా లోన్లను లీగల్ సెటిల్​మెంట్ల ద్వారా తిరిగి చెల్లించారు. పదేపదే ఫోన్ కాల్స్, మానసిక వేధింపులు, బహిరంగ అవమానాలు వంటివి రుణగ్రహీతలకు    ఇబ్బంది కలిగిస్తున్నాయి.  ఏపీలో సెటిల్​మెంట్ల విలువ రూ. 110 కోట్లు కాగా, తెలంగాణలో రూ. 160 కోట్లు దాటింది.  హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్​లలో కేసులు ఎక్కువగా ఉన్నాయని లీగల్​ సావీ తెలిపింది.