న్యూఢిల్లీ : కరోనా వైరస్తో లాక్డౌన్ అమలైనప్పటికీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ (2020–21)లో ఫార్మా పరిశ్రమ 3 నుంచి 5 శాతం పెరుగుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) తెలిపింది. జూన్ నుంచి ఈ రంగంలోని కంపెనీల నెల వారీ ఆదాయమూ పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఇందుకు దేశీయ బిజినెస్ కూడా సాయపడుతుందని పేర్కొంది. కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో సంబంధిత థెరపీలకు ఔషధాలు తయారు చేసే కంపెనీలకు బాగా కలిసి వస్తుందని చెబుతోంది. దేశంలోని ఫార్మా కంపెనీల చేతిలో నగదు నిల్వలు మెరుగ్గానే ఉండటంతోపాటు, అప్పులపరంగానూ సమతులంగానే అవి ఉన్నాయని వెల్లడించింది. దీంతో లాక్డౌన్ కష్టాలను ఫార్మా కంపెనీలు దాటుతాయని పేర్కొంది.
ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీలో ఉండటంతో ఫార్మా పరిశ్రమపై లాక్డౌన్ ప్రభావం తక్కువగానే ఉందని ఇండ్–రా వివరించింది. ఏప్రిల్ నెలలో మాన్యుఫాక్చరింగ్ వాల్యూమ్స్ 50–60 శాతానికి పడిపోయినా, మే–జూన్లో మళ్లీ 60–80 శాతానికి చేరిందని తెలిపింది. లాక్డౌన్ టైంలో కొత్త ప్రొడక్ట్ లాంఛ్లను మాత్రం వాయిదా వేసుకున్నాయని పేర్కొంది. ముడి సరుకుల ధరలు, లాజిస్టిక్స్, మానవ వనరుల వ్యయం పెరగడంతో ఫార్మా ప్రొడక్ట్స్ రేట్లనూ 8 శాతం (నాన్ డీపీసీఓ ప్రొడక్ట్స్) పెంచుకునే వీలు ఫార్మా కంపెనీలకు ఉంటుందని, ఇది గతంలో 5 శాతమేనని ఇండ్–రా తెలిపింది.