హైదరాబాద్, వెలుగు: ఫార్మాస్యూటికల్ కంపెనీ అరబిందో ఫార్మాకు ఈ ఏడాది జూన్తో ముగిసిన క్వార్టర్లో రూ. 520.5 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్లో వచ్చిన రూ. 770 కోట్లతో పోలిస్తే ఈసారి కంపెనీ లాభం 32.4 శాతం తగ్గింది. కంపెనీ రెవెన్యూ 9.4 శాతం పెరిగి రూ. 5,702 కోట్ల నుంచి రూ. 6,236 కోట్లకు చేరుకుంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మంచి ప్రదర్శన చేశామని కంపెనీ వైస్ చైర్మన్ కే నిత్యానంద రెడ్డి అన్నారు. తమ ప్రొడక్ట్లను విస్తరించడానికి పెట్టుబడులు పెడుతున్నామని, కొత్త ప్రొడక్ట్ల లాంచ్లు, ఫైలింగ్ల బట్టి ఈ విషయం అర్ధమవుతుందని అన్నారు.
స్పెషాలిటీ ప్రొడక్ట్లను తయారు చేయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టామని, ఈ ప్రొడక్ట్ల వలన ఫ్యూచర్లో బిజినెస్ వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో యూఎస్ మార్కెట్ నుంచి కంపెనీకి వచ్చే రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 10.8 శాతం పెరిగి రూ. 2,971.1 కోట్లకు చేరుకుంది. డాలర్ల పరంగా చూస్తే మొత్తం రెవెన్యూలో ఇది 47.7 శాతంగా ఉంది. యూరప్ మార్కెట్ నుంచి వచ్చే రెవెన్యూ మాత్రం ఏడాది ప్రాతిపదికన 2.2 శాతం తగ్గి రూ. 1,548.1 కోట్లుగా రికార్డయ్యింది. ఇది మొత్తం రెవెన్యూలో 24.8 శాతంగా ఉంది. అరబిందో ఫార్మా షేరు ధర గురువారం 2 శాతం లాభపడి రూ.576 వద్ద ముగిసింది.