బెంగళూరు: వాల్మార్ట్కు చెందిన పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్ ఫోన్పేకు ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కన్సాలిడేటెడ్ ఆపరేటింగ్ ఆదాయం రెండింతలు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 138 % పెరిగి రూ.1,646 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. అన్ని రకాల వ్యాపారాలలో బలమైన పెరుగుదలే ఇందుకు కారణమని ప్రకటించింది. ఈ ఫిన్టెక్ స్టార్టప్ నష్టం సంవత్సర కాలంలో 15శాతం తగ్గి రూ.671 కోట్లకు చేరుకుంది.
2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి రూ. 727.87 కోట్ల నికర నష్టం వచ్చింది. బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ ఖర్చులు కూడా గత ఏడాది కంటే పెరిగాయి. ఖర్చులలో ముఖ్యమైన మార్కెటింగ్ ఖర్చులు సంవత్సరంలో 62 శాతం పెరిగి రూ.866 కోట్లకు చేరుకున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి ఖర్చు 41 శాతం పెరిగి రూ.555 కోట్లకు చేరుకుంది. ఇతర నిర్వహణ ఖర్చులను రూ.697 కోట్లుగా లెక్కించారు. ఏడాది లెక్కన ఇవి 57 శాతం పెరిగాయి.