సాగు చేయడానికి ఎకరాల కొద్దీ స్థలం లేదు. సరిపడా నీళ్లూ లేవు. కానీ, మూడు అంతస్తుల ఇల్లు ఉంది. దాంతో ఆ ఇంటినే సాగు భూమిగా మార్చుకున్నాడు. బాల్కనీ, టెర్రస్తో పాటు ఇంట్లో ఉన్న ఇంకొంత ఖాళీ స్థలంలో పదివేల మొక్కలు పెంచుతున్నాడు. అది కూడా మట్టితో పనిలేకుండా, అతి తక్కువ నీళ్లతో. ఇలా సాగు చేసిన పంటలతో సంవత్సరానికి అక్షరాల డెబ్భై లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్న ఇతని పేరు రామ్వీర్ సింగ్. ఉత్తర ప్రదేశ్లోని బరేలీలో ఉంటాడు రామ్వీర్ సింగ్. వృత్తిరీత్యా జర్నలిస్ట్. సాధారణంగా చిన్నప్పట్నించీ వ్యవసాయంపై అవగాహన ఉన్నవాళ్లు టెర్రస్, బాల్కనీ గార్డెనింగ్ చేస్తుంటారు. కానీ, రామ్వీర్ సింగ్ మాత్రం ఒక సమస్యకి పరిష్కారంగా సాగు మొదలుపెట్టాడు.
ఉద్యోగం వదిలేసి..
కొన్నేండ్ల కిందట రామ్వీర్ సింగ్ ఫ్రెండ్ వాళ్ల మామయ్య క్యాన్సర్ బారిన పడ్డాడు. అతన్ని చూడ్డానికెళ్లిన రామ్వీర్కి ఆ క్యాన్సర్కి కారణం కెమికల్స్తో నిండిన కూరగాయలే అని తెలిసింది. ‘‘ఈ పరిస్థితే నా భార్యాబిడ్డలకి వస్తే’’ అన్న ఆలోచన తట్టుకోలేకపోయాడు రామ్వీర్. ఆ ఆలోచనే అతన్ని సేంద్రియ వ్యవసాయం వైపు నడిపించింది. అప్పటివరకు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా మారాడు. తనకున్న కొద్దిపాటి భూమిలోనే సాగు మొదలుపెట్టాడు. అయితే, తనుంటున్న ఇంటి నుంచి ఆ పొలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది. రోజూ అంత దూరం ప్రయాణం అంటే కొన్నాళ్లకు ఇబ్బంది అనిపించింది. అయినా ప్రయత్నాన్ని ఆపడం ఇష్టంలేక మరోదారి వెతికాడు. సరిగ్గా అప్పుడే దుబాయిలో జరుగుతున్న ఒక అగ్రికల్చర్ ఈవెంట్కి పిలుపొచ్చింది రామ్సింగ్కి. అక్కడే మట్టితో పనిలేకుండా అతి తక్కువ నీళ్లతో చేసే హైడ్రోపోనిక్ వ్యవసాయం గురించి తెలిసింది. పైగా ఈ పద్ధతితో తెగులు సమస్య కూడా ఉండదని తెలుసుకున్నాడు. ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో అక్కడే కొన్నిరోజులు ఉండి, చుట్టుపక్కల ఆ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతుల్ని కలిశాడు. వాళ్ల ద్వారా హైడ్రోపోనిక్ సాగు గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాడు.
750 చదరపు మీటర్లలో...
ఇండియాకి వచ్చాక తన ఇంట్లోనే హైడ్రోపోనిక్ పద్ధతిలో సాగు చేయాలనుకున్నాడు. అనుకున్నట్టే రెండు అంగుళాలున్న కుండీల్లో వరిపొట్టు, వర్మిక్యులేట్, క్లే బాల్స్ వేసి విత్తనాలు నాటాడు. అవి కొంచెం పెరిగాక.. పీవీసీ పైపులను నిలువు వరుసల్లో ఏర్పాటు చేశాడు. వాటికి రంధ్రాలు పెట్టి, ఆ రంధ్రాల్లో ఆ కుండీలని పెట్టాడు. అలా తన మూడు అంతస్తుల ఇంట్లోని 750 చదరపు మీటర్ల ఖాళీ స్థలంలో వెయ్యికి పైగా మొక్కలు పెంచుతున్నాడు. మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్, నైట్రోజన్, జింక్ లాంటి పదహారు రకాల పోషకాలను నీళ్లలో కలిపి ప్లాస్టిక్ గొట్టాలతో మొక్కల వేళ్లకి పెడుతున్నాడు. మామూలు పద్ధతితో పోలిస్తే హైడ్రోపోనిక్ సాగు ద్వారా 90 శాతం నీళ్లు ఆదా అవుతున్నాయి.
అన్నిరకాల పండ్లు, కూరగాయలు
మిర్చి, క్యాప్సికం, సొరకాయ, టొమాటో, క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ, స్ట్రాబెర్రీ, బెండ, పచ్చి బఠాణీతో పాటు అన్ని రకాలు ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, మరికొన్ని వెజిటబుల్స్ పండిస్తున్నాడు రామ్సింగ్. ‘వింప ఆర్గానిక్ అండ్ హైడ్రోపోనిక్’ అనే కంపెనీ పెట్టి, దాని ద్వారా తను పండించిన పంటను మార్కెట్లోకి తీసుకొస్తున్నాడు. ఏడాదికి డెబ్భై లక్షల రూపాయల దాకా సంపాదిస్తున్నాడు. అలాగే చుట్టుపక్కలుంటున్న వాళ్లకి ఈ సాగు గురించి అవగాహన కల్పిస్తున్నాడు. వీలైనంత ఎక్కువమందిని రసాయనాల బారిన పడకుండా కాపాడటమే నా లక్ష్యం అంటున్నాడు రామ్సింగ్.
‘‘కెమికల్స్తో నిండిన కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బులు వస్తాయి. వాటి నుంచి నా కుటుంబాన్ని, చుట్టూ ఉన్న వాళ్లని కాపాడాలన్న ఆలోచనతోనే హైడ్రోపోనిక్ సాగు మొదలుపెట్టా. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ పద్ధతిలో సాగు చేయొచ్చు. ఈ సాగు వల్ల మట్టిలో ఉండే చెడు బ్యాక్టీరియా వల్ల వచ్చే రోగాలు నుంచి బయట పడొచ్చు. కలుపు సమస్య ఉండదు. చీడపీడల బెడద ఉండదు. అన్నింటికీ మించి నీరు ఆదా అవుతుంది’’ అని చెప్తున్నాడు రామ్సింగ్.