న్యూఢిల్లీ: కరోనా కారణంగా అన్ని రంగాల మాదిరే సినీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపింది. మహమ్మారి వ్యాప్తి భయంతో పలు నెలల పాటు సినిమా హాళ్లు తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో అన్లాక్ పేరుతో మెళ్లిగా పలు రంగాలను తిరిగి తెరవడానికి అనుమతులు ఇచ్చిన కేంద్రం తాజాగా సినిమా ప్రదర్శనలకు కూడా పచ్చ జెండా ఊపింది. ఈ నెల 15 నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. లాక్డౌన్ తర్వాత దేశంలో థియేటర్స్లో విడుదలవనున్న తొలి సినిమాగా ప్రధాని మోడీ బయోపిక్గా తెరకెక్కిన పీఎం నరేంద్ర మోడీ మూవీ నిలువనుంది.
ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మోడీ పాత్రలో నటించారు. ఈ ఫిల్మ్ గతేడాది మే నెలలోనే రిలీజైంది. ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘దేశానికి మోడీయే అత్యుత్తమ ప్రధాని. ఇది గతేడాది ఎన్నికల్లో కూడా నిరూపితమైంది. స్ఫూర్తి నింపే అత్యుత్తమ నాయకుడి కథను చూడటం కంటే ప్రస్తుత సమయంలో ఉత్తమమైనది ఇంకేం ఉంటుంది’ అని ఈ మూవీకి నిర్మాత అయిన సందీప్ సింగ్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు.