హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు లో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠాని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరులో గుట్టుచప్పుడు కాకుండా ఒకే రకం విత్తనాలని వివిధ రకాల బ్రాండ్ లకి చెందిన ప్యాకింగ్ కవర్ లలో నింపి రైతుల్ని మోసం చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాలో నలుగురు వ్యక్తులని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 50 లక్షల విలువైన సుమారు 2 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు,ఒక డిసిఎం వ్యాన్,ఒక సీడ్ ప్రాసెస్సింగ్ మిషన్,ఒక కలర్ డబ్బా మరియు ప్యాకింగ్ కవర్లను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు.
జోగులాంబ గద్వాలకి చెందిన మన్యం లక్ష్మీ నారాయణ హైదరాబాద్ లో నివాసముంటూ.. గత మూడు సంవత్సరాల క్రితం కందుకూరులో ఈ విత్తనాలు తయారీ కంపెనీని ప్రారంభించాడు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా కర్నూల్ జిల్లా నుండి వివిధ బ్రాండ్ లకి చెందిన కవర్లని తెచ్చుకుని, రైతులు తాము అడిగిన బ్రాండ్ కవర్లలో ఒకే రకానికి చెందిన విత్తనాలను నింపి సరఫరా చేసేవాడు. ఇలా మోసాలకు పాల్పడుతున్నారన్న పక్క సమాచారం తో దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై గతం లో కూడా పలు జిల్లాల్లో కేసులు నమోదు అయినట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. ఇలా నకిలీ విత్తనాల కంపెనీలు మరియు నకిలీ విత్తనాలు కొని మోసపోయామని ఎవరైనా రైతులు పిర్యాదు చేస్తే అలాంటి కంపెనీ ల పై చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు తెలిపారు.