కామారెడ్డిలో హీటెక్కుతున్న పాలిటిక్స్!

కామారెడ్డిలో హీటెక్కుతున్న పాలిటిక్స్!

 కామారెడ్డి​, వెలుగు:  హాత్​సే హాత్​జోడో యాత్ర ఎఫెక్ట్​తో కామారెడ్డి జిల్లా  పాలిటిక్స్​ హీటెక్కుతున్నాయి. బీఆర్ఎస్​, కాంగ్రెస్ పార్టీల​ మధ్య  మాటల యుద్ధానికి దారి తీస్తున్నాయి. పాదయాత్రలో భాగంగా నిర్వహించిన కార్నర్  మీటింగ్స్​లో   పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డిని  బీఆర్ఎస్​ లీడర్లు అడ్డుకునేందుకు యత్నించగా,  కాంగ్రెస్ ​లీడర్లు కూడా తగ్గేదేలే అన్నట్లుగా ముందుకెళ్లారు. రేవంత్​రెడ్డి కూడా తనదైన శైలిలో విమర్శలకు పదును పెట్టి, కేసీఆర్ ప్రభుత్వంపై  విరుచుకుపడ్డారు. ఆ వెంటనే  బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు  ప్రెస్ మీట్లు పెట్టి.. కాంగ్రెస్ లీడర్ల వ్యాఖ్యలను  ఖండించారు.  అదే క్రమంలో తాజాగా గంప గోవర్ధన్​, షబ్బీర్​అలీ నియోజవర్గానికి ‘నువ్వేం చేశావంటే..  మంత్రిగా నువ్వేం చేశావో’ చెప్పాలంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.  

చార్జిషీట్లు, ఘాటైన విమర్శలు

రేవంత్​రెడ్డి పాదయాత్రలో  జిల్లాలోని  అన్ని  నియోజక వర్గాల ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై  చార్జిషీట్​రిలీజ్​ చేశారు.  స్థానికంగా ప్రజలను  ఆకట్టుకోవడం,  క్యాడర్​లో జోష్​ నింపేందుకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై  ఘాటైన విమర్శలు కూడా చేశారు. దీనికి  ప్రతిగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు  కాంగ్రెస్​ సీనియర్​నేతలే టార్గెట్​గా విరుచుకుపడుతున్నారు. వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు. 

 షబ్బీర్​ అలీ వర్సెస్​ గంప గోవర్ధన్​

ఈ నెల 18న కామారెడ్డి నియోజకవర్గంలో  రేవంత్​రెడ్డి పాదయాత్ర జరిగింది.  జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్నర్​ మీటింగ్​లో పీసీసీ చీఫ్​ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్​పై తీవ్ర స్థాయిలో  విమర్శలు చేశారు.  కిరాయి ఇంట్లో ఉన్న వ్యక్తికి  ఇంత భారీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.  మరోసారి  మాస్టర్​ ప్లాన్​ పేరిట రైతుల భూములు లాక్కుంటారని  ఆరోపించారు.  దీనికి స్పందనగా బీఆర్ఎస్​యువజన విభాగం ఆధ్వర్యంలో  రేవంత్​రెడ్డి, షబ్బీర్​అలీల  దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇదే క్రమంలో ఇటీవల బీఆర్ఎస్​మాచారెడ్డి మండల  ఆత్మీయ సమ్మేళనం జరిగింది.  మాజీ మంత్రి షబ్బీర్​అలీ సొంత మండలం మాచారెడ్డి  కావడంతో ఎమ్మెల్యే గంప గోవర్ధన్​  ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.  షబ్బీర్​అలీ  హయాంలో ఆయన సొంత మండల  అభివృద్ధికి ఏమి చేయలేదని, ఆయన కుటుంబ సభ్యుల,  అనుచరుల ఆస్తుల పెంచుకునేందుకే సమయం సరిపోయిందని గంప గోవర్ధన్​ ఆరోపణలు చేశారు.  షబ్బీర్​అలీ .. తన ఆస్తులపై చర్చ పెడదామా అంటూ సవాల్​ విసిరారు.  దీంతో  రెండు పార్టీల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీనికి ప్రతిగా  డీసీసీ ప్రెసిడెంట్​ మీడియా సమావేశం నిర్వహించి గంప గోవర్ధన్​పై  తీవ్రమైన విమర్శలు చేశారు. గోవర్ధన్​ అభివృద్ధి ని పక్కన పెట్టి  పర్సంటేజీల కోసమే  పని చేస్తున్నారని ఆరోపించారు.  దోమకొండకు ఒక డిగ్రీ కాలేజీ కూడా  సాధించలేకపోయారని విమర్శించారు.  

2018 ఎన్నికలకు ముందు..

 2018 ఎన్నికలకు ముందు కూడా  గంప గోవర్ధన్​, షబ్బీర్​అలీ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో వ్యక్తి గత విమర్శలు చేసుకున్నారు.  అప్పట్లో  జిల్లా కేంద్రంలోని  గంజులో గాంధీ విగ్రహం ఎదుట  ఎవరికి వారుగా తమ ఆస్తులను వెల్లడించారు.  మళ్లీ ఇప్పుడు అదే సీన్​ రిపీట్​ అవుతుందా..?  అంటూ జిల్లా రాజకీయ  వర్గాల్లో చర్చ నడుస్తోంది.