
- పాక్కు మోడీ సర్కార్ సూచన
- కాశ్మీర్ మా ఇంటర్నల్ మ్యాటర్.. మీ నిర్ణయాల్ని రివ్యూ చేసుకోండి
- వ్యాపార, దౌత్య సంబంధాలు కొనసాగిద్దామంటూ విదేశాంగ శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో జరగరానిదేదో జరుగుతున్నట్లు ప్రాపగండా చేసి, తద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలన్న చెడు బుద్ధితోనే పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియాతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటన చేసిందని విదేశాంగ శాఖ మండిపడింది. కాశ్మీర్ ముమ్మాటికీ ఇండియా అంతర్గత వ్యవహారమని స్పష్టం చేస్తూ, తలుపులు మూసుకోడానికి పాక్ చెబుతున్న కారణాలు గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉన్నాయని ఆక్షేపించింది. ఇండియాతో సంబంధాలన్ని తెంచుకుంటామంటూ పాక్ సర్కారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలపై విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన చేసింది. ట్రేడ్, డిప్లమసీ ఇతరత్రా సంబంధాలన్ని నిలిపేస్తూ ఇమ్రాన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై విచారం వ్యక్తం చేస్తూనే, వాటిని రివ్యూ చేసుకోవాలని, అన్ని రకాల కమ్యూనికేషన్స్ను యథావిథిగా కొనసాగిద్దామని ఇండియా కోరింది.
‘‘జమ్మూకాశ్మీర్లో తొలి నుంచీ ఇండియా రాజ్యాంగమే అమల్లో ఉంది.. ఎప్పటికీ ఉంటుంది కూడా. ఇండియా సావర్నిటీకి సంబంధించిన అంశంలో పాక్ తన పరిధిదాటి చేసే ప్రయత్నాలు ఎప్పటికీ సక్సెస్ కాలేవు. ఆర్టికల్ 370కి సంబంధించి ఇటీవల జరిగిందంతా ఇండియా అంతర్గత వ్యవహారం. జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న ఓ తాత్కాలిక నిబంధనను(370ని) ఎత్తేస్తూ కేంద్రం, పార్లమెంట్ నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల కాశ్మీర్ సమాజంలో వివక్షలు తగ్గుతాయి. ఎకనామిక్ యాక్టివిటీ పెరగడం వల్ల అక్కడి ప్రజలకు మెరుగైన జీవనోపాధి లభిస్తుంది. క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని పెంచిపోషించడానికి వాళ్లకంటూ సాకులు కావాలి కాబట్టి పాక్ సహజంగానే జమ్మూకాశ్మీర్ డెవలప్మెంట్ను వ్యతిరేకిస్తుంది. ఇండియాకు కటీఫ్ చెప్పడానికి పాక్ చెబుతున్న కారణాల్లో ఒక్కదాంట్లోనూ రియాలిటీ లేదు. ఇప్పటికైనా పాక్ తన నిర్ణయాల్ని సమీక్షించుకొని, ఇండియాతో కమ్యూనికేషన్ కొనసాగించాలని కోరుతున్నాం”అని విదేశాంగ శాఖ పేర్కొంది. బుధవారం నాటి ఎన్ఎస్సీ మీటింగ్లో ఇండియాతో అన్ని రిలేషన్స్ కట్ చేసుకోవాలని పాక్ పీఎం ఇమ్రాన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ మేరకు ఇండియా తన రియాక్షన్ తెలిపింది.
పాక్ది మళ్లీ పాత పాటే!
రెండుదేశాల మధ్య సంబంధాల్ని కొనసాగిద్దామంటూ ఇండియా చేసిన ప్రకటనను పాక్ తిరస్కరించింది. జమ్మూకాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ రద్దు విషయంలో ఇండియా చేస్తున్న వాదనను అంగీకరించబోమని, దీన్ని ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తామని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ గురువారం ఇస్లామాబాద్లో మీడియాతో అన్నారు.
బిజినెస్ బంద్తో ఎవరికి నష్టం?
పాక్ నిర్ణయం వల్ల ఇండియాకు కొద్దిపాటి ఇబ్బందులు తప్ప పెద్దగా ఎఫెక్ట్ ఉండదని నిపుణులు అంటున్నారు. రెండు దేశాల మధ్య నేరుగా వాణిజ్య సంబంధాలు లేవని, మూడో దేశం వేదికగా కొద్దో గొప్పో జరుగుతున్న వాణిజ్యాన్ని అనధికార(ఇన్ఫార్మల్) ట్రేడ్గా భావించాలని, దీన్ని నేషనల్ ఇన్కమ్గానూ పరిగణించరని ఎక్స్పర్టులు తెలిపారు.