ధనిక రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల కష్టాలు : అంకం నరేష్, సోషల్​ ఎనలిస్ట్​

ధనిక రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల కష్టాలు : అంకం నరేష్, సోషల్​ ఎనలిస్ట్​

తెలంగాణ ప్రభుత్వం 2023-–-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2.90 లక్షల కోట్లతో బాహుబలి బడ్జెట్ ను శాసనసభలో గత నెల 6వ తేదీన ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా  ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగ, ఉపాధ్యాయులు కీలక భాగ్యస్వామ్యం వహిస్తున్నారని వారి సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక వేతనాలు ఇస్తున్నామని వారి ప్రయోజనాల విషయంలో ఏనాడు తక్కువ చేయలేదంటూ పేర్కొన్నారు.

ఎక్కువ జీతాలు ఏమో కాని ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రతినెల జీతం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రెండేళ్లుగా వేతనాల చెల్లింపు విషయంలో జాప్యం జరుగుతున్నది. మరోపక్క  ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక బిల్లులన్నీ నిలిచిపోయాయి. రుణాలు, అడ్వాన్సులు, రియింబర్స్​మెంట్ బిల్లులకు గత కొన్ని నెలలుగా మోక్షం లభించడం లేదు. ఖజానా కార్యాలయం నుంచి టోకెన్లు జనరేట్ అవుతున్నాయే తప్ప, ఈ-కుబేర్ నుంచి డబ్బులు మాత్రం ఉద్యోగుల ఖాతాల్లో జమ కావడం లేదు.

ఉద్యోగుల బిల్లులన్నీ పెండింగ్

ఉద్యోగుల సరెండర్ లీవ్, మెడికల్ రియింబర్స్​మెంట్, టీఎస్ జీఎల్ఐ క్లెయిమ్​లు, జీపీఎఫ్, పీఆర్సీ బకాయిలు మొదలైన బిల్లులన్నీ  ట్రెజరీ శాఖలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. జనరల్ ప్రావిడెంట్ ఫండ్( జీపీఎఫ్) కింద ప్రతి ఉద్యోగి మూలవేతనం నుంచి ప్రభుత్వం 6 శాతం మినహాయింపులు చేస్తుంది. దీని సొమ్ము రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ శాఖలో జమవుతుంది. 20 ఏళ్ల సర్వీస్ పూర్తయిన ఉద్యోగ ఉపాధ్యాయులు జీపీఎఫ్ ఖాతాల నుంచి పాక్షిక ఉపసంహరణ కింద సొమ్ము తీసుకుంటారు.

ఈ విధంగా తీసుకుంటున్న  జీపీఎఫ్ బిల్లులు గత కొన్ని నెలలుగా అనేక జిల్లాల్లో నిలిచిపోయాయి. ఫలితంగా గృహ నిర్మాణం, ఆరోగ్య సంబంధ విషయాలు, వివాహ శుభకార్యాలు, పిల్లల చదువులు మొదలైన వాటికి ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు జమ చేసుకున్న సొమ్ము ప్రభుత్వం తమ అవసరాలకు వాడుకోవడం వల్ల అవసరాల నిధి అక్కరకు రాకుండా పోయింది. అలాగే పీఆర్సీ ఎరియర్స్ బిల్లులు, సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు చాలా నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి. సమయం ముగిసిన లైఫ్ ఇన్సూరెన్స్ బాండ్ల క్లెయిమ్​ల  బిల్లులు అందక రిటైరైన ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉద్యోగుల వైద్యానికి సంబంధించిన రెండు లక్షల లోపు అత్యవసర మెడికల్ బిల్లులు కూడా మంజూరు కావడం లేదు.

నూతన పద్ధతి అయినా...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్​ఎంఐఎస్)  ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లులను డీడీఓలు తయారుచేసి ఎస్ టీ ఓ కార్యాలయాలకు పంపిస్తారు. ఆ వెంటనే టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దాని ఆధారంగా సొమ్ము మంజూరు కావాలి. ఇంతకు ముందు టోకెన్ జనరేట్ అయిన కొన్ని రోజులకే ఉద్యోగుల ఖాతాల్లో బిల్లుల సొమ్ము జమ అయ్యేది. కానీ ప్రస్తుతం బిల్లు క్లియర్ కావాలంటే ఆర్థిక శాఖ అనుమతి ఉండాల్సిందే. ట్రెజరీ శాఖకు చెందిన ఆడిట్ అధికారులు ఆడిట్ చేసిన అనంతరం బిల్లులు ఈ-కుబేర్ పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు. ఖజానా శాఖకు వస్తున్న రాబడుల ఆధారంగా బిల్లులను మంజూరు చేస్తారు.

ఓ నెలలో రైతుబంధు, ఇంకో నెలలో ఇంకో పథకం, ఇలా ప్రతి నెలలో సంక్షేమ పథకాలకే వచ్చిన నిధులు ఖర్చవుతున్నాయి. జీతాల కోసం నిధులు సమకూర్చుకోవడంలో ఆలస్యం జరగడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు సమయానికి వేతనాలు రావడం లేదు. ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే ఉద్యోగులకు సంస్థలు ఒక తేదీని నిర్ణయించి జీతాలు ఇస్తాయి. కానీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం అలా ఎందుకు ఇవ్వడంలేదనే ప్రశ్నలు వారి నుంచి వ్యక్తమవుతున్నాయి. ధనిక రాష్ట్రంలో జీతాల కోసం, బిల్లుల మంజూరీ కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిని ప్రభుత్వం గుర్తించి వేతన జీవుల వెతలు తీర్చాలి.

జీతాల బాధలు తీరేదెప్పుడు?

ఒకప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రతినెల1వ తేదీన జీతాలు వచ్చేవి. సాధారణ పరిపాలన శాఖ ఏప్రిల్ 1990 లో ఇచ్చిన  ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 223 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతభత్యాలు చెల్లించాలి. కానీ గత రెండేళ్లుగా ధనిక రాష్ట్రంలో జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో సచివాలయం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం వస్తే ఆయా శాఖాధిపతి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు 2వ తేదీ నుంచి 5వ తేదీ లోపు జీతాలు అందుతాయి.

కానీ మిగతా జిల్లాల్లో ఏ తేదీన జీతాలు జమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి నెల ఫలాన తేదీన జీతం వస్తుందని నమ్మకాన్ని ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించడం లేదు. వివిధ మార్గాల ద్వారా వస్తున్న రాబడులు సంక్షేమ పథకాల సబ్సిడీలు, వడ్డీల చెల్లింపులకే సరిపోతుండడంతో ఉద్యోగులకు ప్రతినెల జీతాలు చెల్లించడం కష్టమవుతున్నది. సరైన సమయానికి జీతాలు రాక ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు, ఈఎంఐల చెల్లింపులకు ఉద్యోగులు నానాయాతన పడుతున్నారు. - అంకం నరేష్, సోషల్​ ఎనలిస్ట్​