- వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
- ఈ నెల 7 తోనే ముగిసిన డెడ్లైన్..ఇక ఆర్బీఐ ఆఫీసుల్లోనే ఎక్స్చేంజ్
- వడ్డీ రేట్లు ఇప్పటిలో తగ్గవు..
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో డిపాజిట్, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి డెడ్లైన్ ముగిసినప్పటికీ ఇంకా రూ.10 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ప్రజల దగ్గర మిగిలిపోయాయి. ఈ నోట్లు కూడా బ్యాంకుల్లోకి తిరిగి వస్తాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ధీమా వ్యక్తం చేశారు. రూ. 2000 వేల నోట్లను విత్డ్రా చేస్తామని ఈ ఏడాది మే 19 న ప్రకటించారు. అప్పటి నుంచి ఈ నెల 7 మధ్య 87 శాతం రూ. రెండు వేల నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయని దాస్ అన్నారు. నోట్ల రద్దు తర్వాత రూ.2000 వేల నోట్లను ప్రభుత్వం, ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వీటిని బ్యాంకుల్లో డిపాజిట్, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మొదట సెప్టెంబర్ 30 వరకు టైమ్ ఇచ్చారు. ఆ తర్వాత అక్టోబర్ 7 వరకు డెడ్లైన్ పొడిగించారు. ప్రస్తుతం రూ. 2 వేల నోట్లను ఎక్స్చేంజ్ లేదా తమ బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలనుకుంటే ఆర్బీఐకి చెందిన 19 రీజినల్ ఆఫీసుల్లోనే వీలవుతుంది. రూ. 1,000 నోట్లను తిరిగి తీసుకొచ్చే ఉద్దేశం రిజర్వ్ బ్యాంక్కు లేదు.
ఇన్ఫ్లేషన్పైనే ఫోకస్
వడ్డీ రేట్లను ఇప్పటిలో తగ్గించే ఉద్దేశం లేదని దాస్ స్పష్టం చేశారు. ఇన్ఫ్లేషన్ ఇంకా గరిష్టాల్లోనే ఉందని, ఈ పరిస్థితులను ఆర్బీఐ జాగ్రత్తగా గమనిస్తోందని చెప్పారు. రెపో రేటును 2022 మే నుంచి 250 బేసిస్ పాయింట్లు పెంచారు. ఈ మారిన రేట్ల ప్రభావం వ్యవస్థలో ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. అయినప్పటికీ ఈ ఏడాది జులైలో రిటైల్ ఇన్ఫ్లేషన్ 7.44 శాతం టచ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. కిందటి నెలలో 5 శాతానికి పడింది. ‘వడ్డీ రేట్లు గరిష్టాల్లో కొనసాగుతాయి. అవి ఎంత కాలం కొనసాగుతాయనేది టైమ్, గ్లోబల్ పరిస్థితులు మాత్రమే చెప్పగలవు’ అని కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్లో పాల్గొన్న ఆయన వెల్లడించారు. గ్లోబల్గా క్రూడాయిల్ ధరలు పెరగడంపై దాస్ మాట్లాడారు. ఇన్ఫ్లేషన్కు సంబంధించినంత వరకు పెట్రోల్ బంకుల్లో ఏ ధరలు ఉంటాయో అవే ముఖ్యమని చెప్పారు. క్రూడాయిల్తో పాటు యూఎస్ బాండ్ ఈల్డ్లు కూడా 18 ఏళ్ల గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. ‘గ్లోబల్గా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. వీటి ప్రభావం మిగిలిన దేశాలతో పాటే మనపైనా పడుతుంది. కానీ, దేశ ఎకానమీ బలంగా ఉంది. ఎకానమీ ఫండమెంటల్స్, ఫైనాన్షియల్ సెక్టార్ బలంగా ఉంటే ఎటువంటి అనిశ్చితి పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు. ఈ రెండింటిలోనూ ఇండియా మంచి పొజిషన్లో ఉంది’ అని దాస్ వివరించారు. డాలర్ వాల్యూ పెరుగుతున్నా రూపాయి పెద్దగా పడలేదని ఆయన అన్నారు. ‘ ఈ ఏడాది జనవరి 1 నుంచి చూస్తే డాలర్ మారకంలో రూపాయి విలువ కేవలం 0.6 శాతం మాత్రమే పడింది. ఇదే టైమ్లో డాలర్ విలువ 3 శాతం పెరిగింది. రూపాయి స్టేబుల్గా ఉందని చెప్పొచ్చు. రూపాయి తీవ్రంగా కదలకుండా ఉండేందుకు ఫారెక్స్ మార్కెట్పై ఫోకస్ పెట్టాం ’ అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. 2023–24 లో దేశ జీడీపీ గ్రోత్ రేట్ 6.5 శాతంగా ఉంటుందని వెల్లడించారు.
జన్ ధన్ బెస్ట్
ఫిస్కల్ డెఫిసిట్ను జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నామని, నెక్స్ట్ జనరేషన్పై అప్పుల భారం మోపమని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్లో ఆమె మాట్లాడారు. అప్పులు తగ్గించుకోవడానికి ప్రభుత్వం మార్గాలు వెతుకుతోందని అన్నారు. ‘ఎకానమీ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఫిస్కల్ డెఫిసిట్ను బాధ్యతయుతంగా మేనేజ్ చేస్తున్నాం. అందుకే ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాల వలన ఫ్యూచర్ జనరేషన్పై ఎటువంటి భారం పడుతుందో మాకు తెలుసు’ అని వెల్లడించారు. దేశంలోని అందరికీ ఫైనాన్షియల్ సర్వీస్లు అందుబాటులో ఉండడంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జన్ ధన్ యోజన చాలా కీలకంగా మారిందని నిర్మలా సీతారామన్ అన్నారు. ‘జన్ ధన్ అకౌంట్స్ను 2014 లో ప్రారంభించినప్పుడు చాలా మంది అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఇవి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కాబట్టి ప్రభుత్వ బ్యాంకులపై భారం పెరుగుతుందని అన్నారు. కానీ, ప్రస్తుతం ఈ జన్ ధన్ అకౌంట్ల మొత్తం డిపాజిట్ల విలువ రూ.2 లక్షల కోట్లను దాటింది’ అని వివరించారు.