న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో బుధవారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. డిపాజిట్ వృద్ధి నెమ్మదిగా ఉండటం, అధిక క్రెడిట్ డిమాండ్ను కొనసాగించడానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం, బ్యాంకు డిపాజిట్లు వార్షికంగా 10.2 శాతం నుంచి 9.6 శాతానికి తగ్గాయి. లోన్లకు డిమాండ్ ఏడాదికి 6.5 శాతం నుండి 17.9 శాతం పెరిగింది. డిపాజిట్లు, లోన్లతోపాటు రిటైల్, ఎంఎస్ఎంఈ విభాగంలో ఆస్తుల నాణ్యతపై చర్చ జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రధాని నరేంద్ర మోడీ గత నెలలో ప్రారంభించిన డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల పనితీరును కూడా ఈ సమావేశంలో పరిశీలిస్తారు. రిటైల్, పరిశ్రమ సేవల విభాగాలకు లోన్ల పెరుగుదల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆశించిన గ్రోత్ కనిపించింది. నాన్–ఫుడ్ క్రెడిట్గ్రోత్ 2022 మార్చి లో 8.7 శాతం నుండి సెప్టెంబరు 2022లో 16.4 శాతానికి.. అంటే దాదాపు రెండింతలు పెరిగింది. ఈసీఎల్జీ పథకం సహాయంతో ఎంఎస్ఎంఈలకు క్రెడిట్గ్రోత్ పెరిగింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న టూరిజం, హాస్పిటాలిటీ సెక్టార్లకు తక్కువ వడ్డీలకు అప్పులు ఇవ్వడానికి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) కింద అదనంగా రూ. 50 వేల కోట్లను ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
దీంతో ఈసీఎల్జీఎస్ పరిమితి రూ. 4.5 లక్షల కోట్ల నుండి రూ. 5 లక్షల కోట్లకు పెరిగింది. అదనపు మొత్తాన్ని టూరిజం, హాస్పిటాలిటీ సంస్థలకు ప్రత్యేకంగా కేటాయించారు. కరోనాతో నష్టపోయిన వివిధ రంగాలకు, ప్రత్యేకించి ఎంఎస్ఎంఈ విభాగంలో 7 శాతం రాయితీ రేటుతో క్రెడిట్ పొందడానికి ఈసీఎల్జీఎస్ను 2020 మేలో ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 5 వరకు ఈసీఎల్జీఎస్ కింద సుమారు రూ. 3.67 లక్షల కోట్ల అప్పులు ఇచ్చారు.