షేర్ మార్కెట్లు..అదే రోజు సెటిల్‌‌మెంట్‌‌

షేర్ మార్కెట్లు..అదే రోజు సెటిల్‌‌మెంట్‌‌

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నుంచి  ‘సేమ్‌‌ డే సెటిల్‌‌మెంట్‌‌’  విధానాన్ని అమల్లోకి తేవడానికి రెడీగా ఉన్నామని సెబీ చీఫ్‌‌ మాధవి పూరి బుచ్ పేర్కొన్నారు. టీ+0  విధానం అమల్లోకి వస్తే   ఇన్వెస్టర్లు  కొన్న షేర్లు అదే రోజు తమ డీమాట్ అకౌంట్లకు వస్తాయి. సెటిల్‌‌మెంట్స్‌‌ను  ఇప్పటికే   టీ+2 నుంచి టీ+1 కి తగ్గించిన సెబీ,  మరింతగా మెరుగుపరిచే పనిలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ట్రేడ్ల కోసం   టీ+0  సెటిల్‌‌మెంట్ విధానాన్ని అమలు చేస్తామని, అక్కడి నుంచి  ‘తక్షణ’ సెటిల్‌‌మెంట్ విధానానికి మారుతామని చెప్పారు.

ఈ విధానంలో షేర్లు కొన్న వెంటనే ఇన్వెస్టర్ల డీమాట్ అకౌంట్లలో యాడ్ అవుతాయి. ప్రాఫిట్స్‌‌ వస్తే వెంటనే సెటిల్ అవుతాయి.   దేశంలో టెక్నాలజీ అడ్వాన్స్‌‌ అయ్యిందని,  ఇన్‌‌స్టిట్యూషన్లతో కలిసి ఒక విధానాన్ని తీసుకురాగలిగామని, అందుకే టీ+1  ఇన్వెస్టర్ల ముందుకు తెచ్చామన్నారు. టెక్నాలజీ సాయంతో గత 20 ఏళ్లలో సాధించింది  కేవలం రెండున్నరేళ్లలోనే సాధించామని చెప్పారు.