న్యూఢిల్లీ: మార్కెట్లో కొత్త ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ తగ్గుతోంది. డీమాట్ అకౌంట్లు ఓపెన్ కావడం స్లో అయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్లో కేవలం 16 లక్షల డీమాట్ అకౌంట్లే ఓపెన్ అయ్యాయి. గత రెండున్నరేళ్లలో ఇదే తక్కువ. ప్రతి నెల సగటున 29 లక్షల డీమాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి. 2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాలలో నెలకు సగటున 20.9 లక్షల డీమాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. గత 18 నెలలుగా మార్కెట్ తీవ్ర ఒడుదుడుకుల్లో కదలడం, ఐపీఓల సందడి లేకపోవడం, ఇన్వెస్టర్లకు పెద్దగా రిటర్న్స్ రాకపోవడం వంటి కారణాలతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రజలు ఆసక్తి చూపించడం లేదని ఎనలిస్టులు పేర్కొన్నారు.
ముఖ్యంగా స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు పెద్దగా రాబడి ఇవ్వలేదని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి డీమాట్ అకౌంట్ల సంఖ్య 11.16 కోట్లకు చేరుకున్నాయి. మార్చితో పోలిస్తే కేవలం 1.6 శాతం మాత్రమే పెరిగాయి. కిందటేడాది ఏప్రిల్ నాటికి రికార్డయిన డీమాట్ అకౌంట్లతో పోలిస్తే మాత్రం 26 శాతం పెరిగాయి. ఎఫ్డీలు వంటి ఫిక్స్డ్ ఇన్కమ్ అసెట్స్ మంచి రిటర్న్స్ ఇస్తుండడంతో మార్కెట్పై ప్రజలకు ఆసక్తి తగ్గిందని ఎంఓఎఫ్ఎస్ఎల్ బ్రోకింగ్ ఈక్విటీ హెడ్ హేమాంగ్ జాని అన్నారు. సెప్టెంబర్ 2021, మార్చి 2023 మధ్య సెన్సెక్స్ 0.23 శాతం పడగా, నిఫ్టీ 1.5 శాతం నష్టపోయింది. ఇదే టైమ్లో బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 4 శాతం తగ్గాయి.
మార్కెట్లో వోలటాలిటీ ఎక్కువగా ఉండడంతో కొత్త ఇన్వెస్టర్లకు నష్టాలొస్తున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. దీంతో చాలా మంది మార్కెట్కు దూరంగా ఉంటున్నారని వెల్లడించారు. మరోవైపు సిప్ల ద్వారా మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతున్నాయని ఎనలిస్టులు వివరించారు. మ్యూచువల్ ఫండ్స్లోకి సిప్ల ద్వారా నెలకు సగటున రూ.14,000 కోట్ల ఇన్ఫ్లోస్ వస్తున్నాయని అన్నారు. డీమాట్ అకౌంట్ ఓపెనింగ్స్ తగ్గడానికి కారణం ఐటీ సెక్టార్లో సంక్షోభం రావడమేనని కొంత మంది ఎనలిస్టులు చెబుతున్నారు. ఉద్యోగుల శాలరీలు, హైక్లు తగ్గిపోవడంతో పాటు చాలా మంది జాబ్స్ కోల్పోవడంతో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మంది వెనకడగేస్తున్నారని అన్నారు.