బిజినెస్ డెస్క్, వెలుగు: వెబ్సైట్లు, యాప్ల ద్వారా లెండింగ్ పెరుగుతుండడంతో డిజిటల్ లెండింగ్పై గైడ్లైన్స్ను త్వరలో తీసుకొస్తామని ఆర్బీఐ డిప్యూటి గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు ప్రకటించారు. డిజిటల్ లెండింగ్పై వర్కింగ్ గ్రూప్ రికమండేషన్లను కిందటేడాది నవంబర్లో అందుకున్నామని అన్నారు. కాగా, ఈ రికమండేషన్లపై పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కిందటేడాది డిసెంబర్ 31 వరకు అవకాశం ఇచ్చారు. డిజిటల్ లెండింగ్ గైడ్లైన్స్పై పబ్లిక్ నుంచి కామెంట్స్ అందుకున్నామని, త్వరలో గైడ్లైన్స్ ప్రకటిస్తామని రాజేశ్వర్ రావు అన్నారు. మరోవైపు రిటైల్ పేమెంట్స్ సిస్టమ్ను చూసుకునే సంస్థ నియామకంపై ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ మాట్లాడారు. ఆంబ్రెల్లా ఎంటిటీ (పేమెంట్స్ సిస్టమ్ను చూసుకునే సంస్థగా) గా పనిచేసేందుకు చాలా సంస్థలు తమ అప్లికేషన్ను సబ్మిట్ చేశాయని, కానీ, ఇంకా దేనినీ ఫైనలైజ్ చేయలేదని పేర్కొన్నారు. ఈ సంస్థ నియామకంపై త్వరలో ప్రకటన చేస్తామని చెప్పారు.
ఈ‑రూపీ వోచర్స్ లిమిట్ పెరిగింది..
ఈ–రూపీ ప్రీపెయిడ్ డిజిటల్ వోచర్లపై లిమిట్ను రూ. 10,000 నుంచి రూ. లక్షకు ఆర్బీఐ పెంచింది. అంతేకాకుండా ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ వోచర్ల ద్వారా సర్వీస్లు పొందడానికి అవకాశం ఇచ్చింది. కాగా, ఈ–రూపీని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ డెవలప్ చేసింది. ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారికి ఈ పథకాల బెనిఫిట్స్ను ఈ–రూపీ వోచర్ల కింద అందిస్తారు. ఈ వోచర్లను రిడీమ్ చేసుకోవడం ద్వారా సోషల్ స్కీమ్ బెనిఫిట్స్ను పొందడానికి వీలుంటుంది.
తులిప్స్కున్న వాల్యూ కూడా క్రిప్టోలకు లేదు..
క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ వైఖరి మారలేదు. ఆర్థిక వ్యవస్థకు క్రిప్టోలు మంచివి కావని శక్తికాంత దాస్ మరోసారి పేర్కొన్నారు. వీటికి ఎటువంటి వాల్యూ లేదని, ఒకప్పటి తులిప్ మేనియాలో తులిప్స్కు ఉన్న విలువ కూడా వీటికి లేదని ఆయన అన్నారు. కాగా, తులిప్మేనియా 16 వ శతకంలో యూరప్లో ఏర్పడింది. తులిప్ పూలను రాయల్టీగా చూడడంతో వీటిని ఎక్కువ ధర ఇచ్చి అయినా కొనడానికి అప్పటి ప్రజలు ఎగబడ్డారు. దీంతో తులిప్ ధరలు ఆకాశాన్నంటగా, వీటి సప్లయ్ ఒక్కసారిగా పెరగడంతో వీటి రేట్లు భారీగా క్రాష్ అయ్యాయి. తులిప్ మేనియాను చరిత్రలోనే అతిపెద్ద క్రాష్ (స్కామ్) గా చూస్తారు.
వడ్డీ రేట్లు మారలే..
యూఎస్ ఫెడ్తో సహా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీ రేట్లను పెంచుతున్నా, ఆర్బీఐ మాత్రం వడ్డీ రేట్లను పెంచడానికి ఇష్టపడలేదు. ఎకానమీకి అవసరం అనిపిస్తే రేట్లను తగ్గిస్తామనే సంకేతాలను కూడా ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. రెపో రేటును (బ్యాంకులకు ఇచ్చే ఫండ్స్పై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ) 4 శాతంగా, రివర్స్ రెపో రేటు (తన దగ్గర బ్యాంకులు డిపాజిట్ చేసే ఫండ్స్పై ఆర్బీఐ ఇచ్చే వడ్డీ) ను 3.35 శాతంగా కొనసాగించింది. కాగా, వరసగా 10 వ ఎంపీసీ మీటింగ్లోనూ ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చక పోవడం విశేషం. కానీ, వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించడానికి వేరిబుల్ రివర్స్ రెపో రేటు (వీఆర్ఆర్ఆర్) కింద చర్యలు తీసుకుంది. తాజాగా 14–రోజుల టైమ్ పీరియడ్ ఉండే వేరిబుల్ రివర్స్ రెపో, వేరిబుల్ రెపో ఆక్షన్లను మెయిన్ లిక్విడిటీ మేనేజ్మెంట్ టూల్స్గా వాడతామని ప్రకటించింది. దీనర్ధం 14 రోజుల వీఆర్ఆర్ఆర్ ఆక్షన్ ద్వారా బ్యాంకుల దగ్గర ఉన్న లిక్విడిటీని ఆర్బీఐ తగ్గించాలని చూస్తోంది. తాజా ఎంపీసీ పాలసీ మేము వేసిన అంచనాల కంటే ఎక్కువ డోవిష్ (వడ్డీ రేట్లను తగ్గించడానికి రెడీగా ఉన్నామనే సంకేతాలు ఇవ్వడం) గా ఉంది. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఆర్బీఐ వీటికి భిన్నంగా రెస్పాండ్ అయ్యింది. 2022–23 లో ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ వేసిన అంచనాల కంటే 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంటుందని అంచనావేస్తున్నాం.
‑ ఉపాస్న భరద్వాజ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ సీనియర్ ఎకనామిస్ట్