2022 లో 15 శాతం గ్రోత్తో 2.11 కోట్లకు చేరినయ్
న్యూఢిల్లీ: కిందటేడాది అంటే 2022లో దేశంలో వెహికల్స్ రిటెయిల్ అమ్మకాలు 15.28 శాతం పెరిగి 2,11,20,441 యూనిట్లకు చేరాయి. ఈ కాలంలో పాసింజర్ వెహికల్స్, ట్రాక్టర్ల సేల్స్ రికార్డు లెవెల్కి చేరినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఫాడా) గురువారం వెల్లడించింది. అంతకు ముందు ఏడాది 2021లో దేశంలో మొత్తంగా వెహికల్స్ రిటెయిల్ సేల్స్ 1,83,21,760 యూనిట్లని పేర్కొంది. 2022లో టూవీలర్ల అమ్మకాలు 13.37 శాతం ఎక్కువై 1,53,88,062 యూనిట్లకు చేరాయని వివరించింది. 2021లో టూ వీలర్ల అమ్మకాలు 1,35,73,682 యూనిట్లు. పాసింజర్ వెహికల్స్ (కార్లు) సేల్స్ 2022లో 16.35 శాతం ఎగసి 34,31,497 యూనిట్లయినట్లు ఫాడా డేటా చెబుతోంది. మొత్తం వెహికల్స్ అమ్మకాలు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 15 శాతం, 2020 తో పోలిస్తే 17 శాతం పెరిగినప్పటికీ 2019 (ప్రీ కొవిడ్) లెవెల్ను మాత్రం అందుకోలేకపోయినట్లు ఫాడా ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా చెప్పారు. ఆ ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 10 శాతం తగ్గాయని పేర్కొన్నారు. కార్ల అమ్మకాలు మాత్రం 2022 లో జోరందుకున్నాయని వెల్లడించారు. దేశంలో ఇప్పటిదాకా నమోదయిన అత్యధిక అమ్మకాలు ఈ ఏడాదివేనని పేర్కొన్నారు. డిసెంబర్ 2022లో టూ వీలర్ల అమ్మకాలు తగ్గి, నిరుత్సాహపరిచాయని వాపోయారు. అంతకు ముందు రెండు నెలలూ వాటి సేల్స్ పెరిగాయని అన్నారు.
రికార్డు లెవెల్కి ట్రాక్టర్ల సేల్స్...
ఇన్ఫ్లేషన్ పెరుగుదల, ధరలు పెరగడం, రూరల్ మార్కెట్లు ఇంకా పుంజుకోకపోవడంతోపాటు, ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ ఎక్కువవడం వంటి కారణాల వల్లే టూ వీలర్ల అమ్మకాలు పెరగడం లేదని మనీష్ రాజ్ సింఘానియా వివరించారు. 2022 లో కమర్షియల్ వెహికల్స్ (సీవీ) రిటెయిల్ సేల్స్ 31.97 శాతం పెరిగాయని, ఈ కాలంలో మొత్తం 8,65,344 సీవీలు అమ్ముడయ్యాయని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ టైములో బాగా పడిపోయిన టూ వీలర్ల అమ్మకాలు 2022లో కొంత పెరిగాయని చెప్పారు. ఎలక్ట్రిక్ రిక్షా సెగ్మెంట్ 2022లో ఏకంగా 50 శాతం గ్రోత్ రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. త్రీ వీలర్ల రిటెయిల్ సేల్స్ భారీగా పెరిగి 6,40,559 యూనిట్లకు చేరాయని అన్నారు.