కారు బోల్తా పడి విద్యార్థిని మృతి ..మరో ముగ్గురికి గాయాలు

కారు బోల్తా పడి విద్యార్థిని మృతి ..మరో ముగ్గురికి గాయాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: కారు అదుపుతప్పి బోల్తా పడడంతో విద్యార్థిని మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేటకు చెందిన కొత్తూరి ప్రతిమ(17) ఇంటర్ పూర్తి చేసింది. ఫతేనగర్​కు చెందిన గొల్ల చింటు(17) ప్రేమిస్తున్నానని కొంతకాలంగా ఆమె వెంటపడి వేధిస్తున్నాడు. దీంతో రెండు, మూడుసార్లు విద్యార్థిని కుటుంబం అతడిని మందలించింది.  అయినా తీరు మార్చుకోలేదు. 

ఇంట్లో చెప్పకుండా ప్రతిమను శనివారం చింటు, అతడి ఫ్రెండ్స్ మనోహర్, శివకుమార్ కలిసి ఇన్నోవా కారులో మెదక్​ జిల్లాలోని ఏడుపాయలకు తీసుకెళ్లారు. అదేరోజు రాత్రి 2 గంటల సమయంలో భోజనం చేసేందుకు పోతంశెట్టిపల్లి వైపు వెళ్తుండగా బస్టాండ్​ సమీపంలోకి రాగానే కారు డివైడర్​ను ఢీ కొట్టి బోల్తా పడింది. కారులోని నలుగురు గాయపడ్డారు. 

స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనాస్థలానికి చేరుకొని బాధితులను హాస్పిటల్​కు తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే ప్రతిమ చనిపోయినట్లు నిర్ధారించారు. చింటు, మనోహర్, శివకుమార్​కు స్వల్ప గాయాలు అయ్యాయి. కాగా తన కూతురిని తీసుకెళ్లి ఆమె మృతికి కారణమైన చింటుపై చర్యలు తీసుకోవాలని ప్రతిమ తండ్రి అంజయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.