
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి క్రికెట్ లో అడుగుపెట్టడం ఖాయమైంది. తన ఫిట్ నెస్ పై ఉన్న అనుమానాలను తొలగించాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో జరిగిన ప్రీ-సీజన్ ఫిట్నెస్ పరీక్షలో హిట్ మ్యాన్ ఉత్తీర్ణుడయ్యాడు. ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడడం.. ఐపీఎల్ తర్వాత ఎలాంటి మ్యాచ్ ల్లో ఆడకపోవడంతో చాలామంది రోహిత్ శర్మ కెరీర్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత హిట్ మ్యాన్ కెరీర్ సందిగ్ధంలో పడింది. వయసు మీద పడడం, ఫిట్ నెస్ సమస్యలు లాంటి విషయాలు రోహిత్ వన్డే కెరీర్ ను అయోమయంలో పడేశాయి.
కేవలం 50 ఓవర్ల ఫార్మాట్ ఆడుతున్న రోహిత్ కెప్టెన్సీ సంగతి పక్కనపెడితే జట్టులో కొనసాగుతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందరి అనుమానాలను క్లియర్ చేస్తూ ఫిట్ నెస్ లో పాసయ్యి ఆస్ట్రేలియా సిరీస్ కు తాను రెడీ అని చెప్పాడు. ఇటీవలే బ్యాట్ పట్టి ప్రాక్టీస్ మొదలు పెట్టిన హిట్ మ్యాన్.. తాజాగా ఆస్ట్రేలియా ఏ జట్టుతో వన్డేలను ఆడడానికి ఆసక్తి చూపించినట్టు సమాచారం. టీమిండియా తదుపరి వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 19 నుండి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియా ఏ జట్టుతో మూడు అనధికారిక వన్డే మ్యాచ్ లు ఆడనుంది.
రోహిత్ శర్మతో పాటు మిగిలిన టీమిండియా క్రికెటర్లు అందరూ ఫిట్ నెస్ టెస్ట్ ను క్లియర్ చేశారు. ఇటీవలే జ్వరం కారణంగా ఇబ్బంది పడిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ ఆసియా కప్ కు ముందు తన ఫిట్ నెస్ ను నిరూపించుకుని ఈ మెగా టోర్నీకి సిద్ధమవుతున్నాడు. శుభమాన్ గిల్, మహ్మద్ సిరాజ్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ ఫిట్నెస్ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ కృష్ణ అందరి కంటే ఎక్కువ స్కోర్ చేసినట్టు తెలుస్తోంది.
ఆసియా కప్ స్క్వాడ్ లో ఉన్న అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ లతో పాటు స్టాండ్బై ప్లేయర్ రియాన్ పరాగ్ ఇటీవల దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్లో ఆడారు. వీరికి ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించబడలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ గజ్జల్లో సమస్య కారణంగా క్వార్టర్ ఫైనల్కు దూరమయ్యి వైద్య పర్యవేక్షణలో ఉన్నాడు.